అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు: క్యూనెట్ మోసంపై మరోసారి...
లక్షలాది మంది కస్టమర్లు ఆ సంస్థలో చేరడానికి బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన ప్రముఖ హీరోలు, సెలబ్రెటీల ప్రచారమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ తరఫున ప్రచారం చేసినవారిలో సెలబ్రెటీలు అనిల్ కపూర్, షారూక్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అలు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులున్నారు.
హైదరాబాద్: క్యూనెట్, దాని అనుబంధ సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ లకు ప్రచారం చేసిన సెలబ్రెటీలకు సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వస్తువులను మార్కెటింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ దాన్ని ఆసరా చేసుకుని మల్టీ లెవెల్ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో ఆ సంస్థకు సంబంధించిన మోసంపై 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్టు చేశారు.
లక్షలాది మంది కస్టమర్లు ఆ సంస్థలో చేరడానికి బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన ప్రముఖ హీరోలు, సెలబ్రెటీల ప్రచారమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ తరఫున ప్రచారం చేసినవారిలో సెలబ్రెటీలు అనిల్ కపూర్, షారూక్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అలు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులున్నారు.
సైబరాబాద్ పోలీసులు గతంలోనే వారికి నోటీసులు జారీ చేశారు. వారిలో కొద్ది మంది మాత్రమే నోటీసులకు స్పందించి తమ న్యాయవాదుల ద్వారా సమాధానాలు ఇచ్చారు. సమధానాలు ఇవ్వని సెలబ్రెటీలుకు పోలీసులు గత నెలలో రెండో సారి నోటీసులు జారీ చేశారు.
తమ నోటీసులకు సెలబ్రెటీలు సరైన సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తాము క్యూనెట్ కు గానీ, దాని అనుబంధ సంస్థకు గానీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించలేదని వారు చెప్పారు. లక్షల్లో లేదా కోట్లలో తాము పారితోషికం తీసుకున్నట్లు ఓ ఒక్కరు కూడా చెప్పలేదని తెలుస్తోంది.
మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్, ఆర్వోసీ అధికారులు క్యూనెట్ మోసాన్ని బయటపెట్టారు. దీంతో సెలబ్రెటీలు ఇచ్చిన సమాధానాలను ఈవోడబ్ల్యూ పోలీసులు పరిశీలిస్తున్నారు. సెలబ్రెటీలు ఇచ్చిన సమాధానాలకు, వారు చేసిన ప్రచారానికి పొంతన కుదరడం లేదని సమాచారం. దీంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు క్యూనెట్ అనుబంధ సంస్థలకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సెలబ్రెటీలకు మరోసారి నోటీసులు జారీ చేస్తారని సమాచారం.