పుట్టా మధు తమ్ముడి కూతురి కులాంతర వివాహం... రక్షించాలంటూ హెచ్చార్సీకి ప్రేమజంట
తమకు ప్రాణహాని వుందంటూ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ ప్రేమ జంట మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది.
కరీంనగర్: తమకు ప్రాణహాని వుందంటూ పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ ప్రేమ జంట మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. మంథని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ తమ్ముడు(చిన్నాన్న కొడుకు) పుట్ట ముఖేష్ కూతురు పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే తమకు పుట్టా కుటుంబం నుండి ప్రాణహాని వుందంటూ నూతన జంట హెచ్చార్సీని ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళితే...మంథనికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, తెరాస నాయకుడు ముఖేష్ కూతురు పుట్ట శరణ్య, రవికిరణ్ లు గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చిన్ననాటి నుండి(13 ఏళ్లుగా) వీరు ప్రేమించుకుంటున్న ఇటీవలే వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసింది.
అయితే వీరిద్దరి కులాలు వేరు కావడమే కాదు... యువకుడిది పేద కుటుంబం. అంతేకాకుండా యువకుడి తండ్రి దీకొండ వేణు వైన్ షాప్ లో పనిచేస్తాడు. దీంతో వీరి ప్రేమకు శరణ్య కుటుంబం అడ్డుచెప్పడమే కాదు వీరిద్దరిని కలవకుండా ఆంక్షలు విధించారు.
దీంతో ఈ ప్రేమ జంట ఈ నెల 15న వరంగల్ జిల్లాలోని ఓ దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
తన పెద్దనాన్న,పెద్దపల్లి జడ్పి చైర్మన్ పుట్ట మధుకర్, మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పుట్ట శైలజ,తన తండ్రి పుట్ట ముఖేష్,తల్లి పుట్ట పద్మ, తమ్ముడు పుట్ట సన్నిత్ మరియు వారి అనుచరుల నుండి తమకు రక్షణ కల్పించాలని శరణ్య హెచ్చార్సీని కోరారు. తమ జంటకు రక్షణ కల్పించాలని రామగుండం పోలీసు కమిషనర్ గారిని ఆదేశించాలని హెచ్చార్సీని కోరింది ఈ ప్రేమ జంట.