ఎమ్మెల్యేకు చేదు అనుభవం..చుక్కలు చూపించిన గ్రామస్థులు
ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్థులు
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ఆయన సొంత మండలం చిన్నగూడూరులో చుక్కెదురైంది. అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన నేపథ్యంలో మండలానికి వచ్చిన ఆయనకు గ్రామస్థులు చుక్కలు చూపించారు. ఆయన కాన్వాయిని అడ్డుకొని నిరసన తెలిపారు.
ఎంతో కాలంగా తాము తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నామని.. వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు.. ఖాలీ బిందెలతో ఆయన కాన్వాయి ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు.
మహిళల నిరసనతో వాహనం దిగిన ఎమ్మెల్యే రెడ్యాతో యాదవ కాలనీ వాసులు వాగ్వాదానికి దిగారు.
తమకు తాగునీరు అందటం లేదని తెలిపారు. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండువేసవిలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నట్లు విన్నవిస్తున్న క్రమంలో పార్టీ శ్రేణులకు ఆందోళనకారులకు వివాదం చోటు చేసుకోంది.
పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా స్థానిక ఎస్సై సమస్య తెలియజేయాలని రోడ్లపై నిరసన సరికాదని ఇరు వర్గాలకు సర్ధి చెప్పి శాంతపరిచారు. కాగా ఎమ్మెల్యే రెడ్యా సంఘటన స్థలం నుంచి ఆర్డబ్ల్యుఎస్ అధికారి సంజీవ తదితరులతో మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఫోన్లో ఆదేశించారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ ఆందోళనతో ఎమ్మెల్యే దాదాపు అరగంట పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది.