ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకం: అంత్యక్రియలకు క్షణం ముందు... బయటపడ్డ వాస్తవం
కరోనా విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తాజాగా హైదరాబాద్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది
కరోనా విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తాజాగా హైదరాబాద్లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఘన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కోవిడ్ సోకడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం అతను మృతిచెందాడు.
అయితే ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్లో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించింది. అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఆ మృతదేహం మరొకరిదిగా గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిలిపివేశారు.
ప్రైవేట్ ఆసుపత్రి తీరుపై మృతుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులపై అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించిన సంగతి తెలిసిందే.
జీవోలు ఉల్లంఘించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆగస్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం చేశాయో లేదా పరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది.
పేదలకు ఉచిత వైద్యం అందించకపోతే లోపం ఎక్కడో పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీ తరహాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు పడకలు కేటాయించాలని సలహా ఇచ్చింది. ప్రభుత్వానికి వీలు కాకపోతే కారణాలు తెలపాలని కూడా కోరింది. సీఎస్ నేతృత్వంలో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని కూడ సూచించింది.