శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో... ఇవాళ్టీ నుంచి డిసెంబర్ 13 వరకు బిడ్ల స్వీకరణ
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వేయనున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్కు సంబంధించి ఇవాళ్టీ నుంచి బిడ్లను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం జరిగింది.

శంషాబాద్ విమానాశ్రయం వరకు హైదరాబాద్ మెట్రోను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయదుర్గం నుంచి చేపట్టనున్న నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి ఇంజినీరింగ్ కన్సల్టెన్సీల ప్రీ బిడ్ సమావేశం జరిగింది. ఈ భేటీకి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. మంగళవారం నుంచి ఈ నెల 13 వరకు కన్సల్టెన్సీల నుంచి బిడ్లను స్వీకరించనున్నారు.
ఇకపోతే.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు వేయనున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్ తో పాటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) కూడా భాగస్వామి కాబోతోంది.
ALso Read:శంషాబాద్ విమానాశ్రయం వరకు హైదరాబాద్ మెట్రో... కీలక పరిణామం, నిర్మాణంలో భాగస్వామిగా హెచ్ఏఎంల్
కాగా... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరానికి అనుసంధానిస్తూ నేరుగా మెట్రో సదుపాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మూడేళ్లలో ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయనుంది. మైండ్ స్పేస్ జంక్షన్ సమీపంలోని రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో కారిడార్ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం వెల్లడించారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్లో భవిష్యత్ రవాణా అవసరాలను గుర్తిస్తూ, అందుకు అనుకూలమైన సదుపాయాలను కల్పించే దార్శనికతతో సీఎం కేసీఆర్ ఈ మెట్రో ప్రాజెక్టు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మెట్రో లైన్ బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డులోని నానక్ రామ్ గూడా జంక్షన్ను కలుపుతూ వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా ఈ లైన్ వెళ్లుతుంది. మొత్తం 31 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు. ఇందుకోసం రూ. 6,250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించనుంది. ఈ మార్గం కీలకంగా మారనుంది. ఈ దారి వెంట పలు అంతర్జాతీయ సంస్థల కార్యాలయాలు వెలువబోతున్నాయి.