అంధకారంలో అంధుల వసతి గృహం
విద్యుత్ అధికారుల తీరు దారుణం
వాతావరణం లో మార్పులు ఏర్పడి ఒక్క క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోతేనే మనం గగ్గోలు పెడుతాం. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి. అది కూడా అంధుల హాస్టల్ లో . ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహలకు కుడా అందదు. హైదరాబాద్ లోని మలక్ పేట్ లోని ముసారాంబాగ్ లోని బాలుర అంధుల వసతి గృహానికి సకాలంలో విద్యుత్ బకాయి ను చెల్లించలేదనే నెపంతో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈరోజు ఉదయం తెల్లవారు జామున విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
దీనితో అంధ విద్యార్థులు ఉదయం నుండి నీరు లేక కాలకృత్యాలు తీర్చుకోవలన్నా, వంట చేయాలన్నా, కనీస సౌకర్యాలు తీర్చుకోవలన్నా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి కాలం ఆపై ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతినెల క్రమం తప్పకుండా సకాలంలో విద్యుత్ చార్జీల ను చెల్లిస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు పని గట్టుకొని తరుచూ అంధుల వసతి గృహానికి విద్యుత్ సరఫరా ను నిలిపివేస్తున్నారని , కనీసం మానవత్వం కుడా వారు పాటించడంలేదని వార్డెన్ సునిత మీడియాకు తెలిపారు.