చార్జీలు పెంపు: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కరెంట్ షాక్
తెలంగాణ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కరెంట్ షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు పెంచుతామని ఆయన శాసనసభలో ప్రకటించారు. స్వల్పంగా చార్జీలు పెంచుతామని అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో స్వల్పంగా కరెంట్ చార్జీలు పెంచుతామని, వచ్చే బడ్జెట్ లో వాటిని పెంచుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం లేదని చెప్పారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు శనివారం ఆయన శాసనసభలో సమాధానం ఇచ్చారు. అప్పులు తెచ్చి కరెంట్ ఇస్తున్నట్లు కాంగ్రెసు నాయకులు ఆరోపిస్తున్నారని, ఆరేళ్లలో ఒక్కసారి మాత్రమే కరెంట్ చార్జీలు పెంచామని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ కు అడ్డుకట్టవేశామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ అద్భుతమైన పథకమని, ఈ పథకాన్ని దేశం యావత్తు ప్రశంసించిందని ఆయన చెప్పారు. మిషన్ భగీరథపై అన్ని వివరాలు తీసుకుని వచ్చి మాట్లాడుతుంటే కాంగ్రెసువాళ్లు పారిపోయారని ఆయన అన్నారు.
సభలో పిచ్చికూతలు కూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ నియోజకవర్గంలో 334 నివాసాలకు నీళ్లు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయం ఆ సభ్యుడికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు ఈ పథకం కోసం ఇప్పటికే రూ.41 వేల కోట్లు ఖర్చు చేశామని మరో 3 వేల కోట్లకు టెండర్లను ఆహ్వానిస్తామని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పథకాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఆయన చెప్పారు.