పోస్టు మార్టం పూర్తి : సురేందర్ గౌడ్ మృతదేహం ఫ్యామిలీకి అప్పగింత
ఆర్టీసీ కార్మికులు ఆంధోళనను ఉధృతం చేస్తున్నారు. సురేందర్ గౌడ్ అనే కండక్టర్ ఉద్యోగం రాదని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన రాణిగంజ్ డిపోకు చెందిన కండక్టర్ సురేందర్ గౌడ్ మృతదేహానికి సోమవారం నాడు ఉదయమే పోస్టుమార్టం పూర్తైంది. సురేందర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు సహచర ఉద్యోగులు ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకొన్నారు.
రాణిగంజ్ డిపోలో కండక్టర్ గా సురేందర్ గౌడ్ పనిచేస్తున్నాడు, సమ్మె చేస్తున్నకార్మికులను విధుల నుండి తొలగిస్తున్నట్టుగా సీఎం ప్రకటించడంతో సురేందర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సోమవారం ఉదయమే ఉస్మానియా ఆసుపత్రిలో సురేందర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకొన్న వెంటనే సహచర ఆర్టీసీ ఉద్యోగులు సోమవారం నాడు పెద్ద ఎత్తున ఉస్మానియా ఆసుపత్రికి చేరుకొన్నారు.
అయితే ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆర్టీసీ కార్మికులను పోలీసులు అనుమతించలేదు. కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించారు. సురేందర్ గౌడ్ కుటుంబసభ్యులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సోమవారం నాడు పరామర్శించారు.పోస్టుమార్టం పూర్తైన తర్వాత కార్వాన్ కు సురేందర్ గౌడ్ మృతదేహాన్ని తరలించారు. కార్వాన్ లో సురేందర్ గౌడ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.