రాజకీయాల్లో గెలవడం యూపీఎస్సీ ఎగ్జామ్ కంటే కూడా టఫ్: మంత్రి కేటీఆర్
రాజకీయాలలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాయడం కంటే కూడా చాలా కష్టమైన పని అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయాన్ని వృత్తిగా ఎంచుకునే అంశంలో ఎన్నో త్యాగాలు ఉంటాయని వివరించారు. మరెన్నో సవాళ్లు ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్: రాజకీయాల్లో గెలవడం అంత సులువు కాదని, యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినమైనదని మంత్రి కేటీఆర్ అన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే అందుకోసం తగిన త్యాగాలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇందుకు రాజకీయ రంగం మినహాయింపు ఏమీ కాదని చెప్పారు. రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవడం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుందని తెలిపారు. మొహలీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాల్లోకి విభిన్న అనుభవాలు గల యువత రావాలని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసిన అనుభవాలతోనే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు.
ప్రభుత్వాలు రుణాలు తీసుకోవడంపై ప్రజల్లో అపోహ ఉన్నదని, అది పోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు రుణాలను భవితకు పెట్టుబడిగా చూస్తుంటాయని, కానీ, ఇక్కడ అనేక అపోహలు ఉన్నాయని తెలిపారు. యువత ఇప్పుడు ఉద్యోగాలు సంపాదించగానే లోన్లు తీసుకుని అనుకూల పరిస్థితులను ఏర్పరుచుకుంటున్నదని వివరించారు. అదే విధంగా దేశాలు కూడా రుణాలు తీసుకుని మౌలిక వసతులపై పెట్టే డబ్బులను భవిష్యత్ పై పెట్టుబడిగా, భావి రాబడిగానే చూడాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా.. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న చిన్న రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. ఉద్యమాలు, పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపించడంలో విజయం సాధించిందని తెలిపారు. అతి తక్కువ సమయంలో అభివృద్ధిని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.