కాసేపట్లో అరెస్ట్పై ప్రకటన.. షర్మిలను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే ఛాన్స్..?
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకుముందే ఆమెకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్పై కాసేపట్లో పోలీసులు ప్రకటన చేయనున్నారు. అనంతరం ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి...వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తర్వాత షర్మిలను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం వుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
కాగా... నిన్న నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని లింగగిరిలో వైఎస్ షర్మిలకు చెందిన బస్సుపై టీఆర్ఎస్ శ్రేణులు నిప్పు పెట్టారు. అంతే కాదు షర్మిల పార్టీకి చెందిన వాహనాలపై దాడి చేశారు . ఈ ఘటనలో నాలుగు వాహానాలు ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిని వైఎస్ఆర్టీపీ శ్రేణులు అడ్డుకొనే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి హైద్రాబాద్ కు తీసుకు వచ్చి రాత్రి లోటస్ పాండ్లో వదిలి వెళ్లిపోయారు.
ALso REad:మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. పోలీసులు మాకేం కొత్తా : షర్మిల అరెస్ట్పై వైఎస్ విజయమ్మ
అయితే నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ను ముట్టడించాలని వైఎస్ఆర్టీపీ తలపెట్టింది. పోలీసుల కళ్లుగప్పి షర్మిల లోటస్ పాండ్ నుండి బయటకు వెళ్లారు. సోమాజీగూడ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన తర్వాత కూడా ఆమె కారు నుండి దిగలేదు. దీంతో కారు డోర్ లాక్స్ ఓపెన్ చేసి షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకెళ్లారు పోలీసులు. మరోవైపు షర్మిలకు మద్దతుగా వచ్చిన వైఎస్ఆర్టీపీ శ్రేణులు, షర్మిల అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.