పోచంపల్లిలో నకిలీ మద్యం తయారీ: పలు జిల్లాలకు సరఫరా
యాదాద్రి భువనగరి జిల్లా పోచంపల్లిలో నకిలీ మద్యం తయారీ చేసే యూనిట్ ను సోమవారం నాడు పోలీసులు సీజ్ చేశారు.
పోచంపల్లి: భూదాన్ పోచంపల్లిలో నకిలీ మద్యం సరఫరా చేసే ముఠా గుట్టు రట్టయింది. సోమవారం నాడు నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో భారీగా నకిలీ మద్యం తయారు చేసేందుకు ఉపయోగించిన ముడిసరుకును ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు.
పోచంపల్లి మండలకేంద్రంలోని మూతపడిన గోడౌన్లో కొంత కాలంగా నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ గోడౌన్ లో మద్యం తయారీకి ఉపయోగించే ముడిసరకును భారీగా నిల్వ ఉన్నట్టుగా గుర్తించారు.
ఖాళీ మద్యం సీసాలు, మద్యం సీసాల మూతలను కూడ గోడౌన్ లో నిల్వ ఉంచారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని హైద్రాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాలకు సరఫరా చేసినట్టుగా గుర్తించారు.