సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు కీలక సాక్ష్యాధారాలు సంపాదించారు. ప్రమాదం జరగడానికి ముందు , వెనుక సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం  చేసుకున్నారు. 

సికింద్రాబాద్ బోయగూడ అగ్నిప్రమాదం ( secunderabad bhoiguda fire accident) ఎలా సంభవించింది...? ప్రమాదం నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు. నిన్న తెల్లవారుజామున 3.55 నిమిషాలకు స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. మంటల్ని గమనించిన ప్రేమ్ కుమార్ (prem kumar) అనే వ్యక్తి .. కిటికీల గ్రిల్స్ తొలగించి, పిట్టగోడపై నుంచి కిందకు దిగాడు. అదే సమయంలో ఈ ప్రమాదాన్ని గమనించిన ఒక వ్యక్తి ప్రేమ్ కిటికీల నుంచి కిందకు రావడం గమనించి అతనికి సాయం చేశాడు. 

ప్రేమ్ కుమార్ బయటపడ్డ తర్వాత గోదాములో భారీ పేలుళ్లు చోటు చేసుకుని, ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు ఈ గోదాము యజమాని పరారీలో వున్నాడు. దీంతో అతని కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రేమ్ కుమార్ క్షేమంగా బయటపడ్డ మరు నిమిషంలోనే గౌదాములో సిలిండర్లు పేలాయి. చూస్తుండగానే మంటలు చెలరేగాయి. ప్రమాదంలో మొదటి అంతస్తులో ఒక గదిలో వున్న ఇద్దరు, మరో గదిలో వున్న 9 మంది సజీవ దహనమయ్యారు. దీనికి సంబంధించి ప్రమాదానికి ముందు, వెనుక సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు సంపాదించారు. 

ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్ కుమార్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. స్క్రాప్ గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం చోటు చేసుకుందని ప్రేమ్‌కుమార్ స్పష్టం చేశాడు. రెండేళ్లుగా తాను గోదాంలోనే పనిచేస్తున్నానని.. తనతో పాటు 11 మంది గోదాం మొదటి ఫ్లోర్‌లోనే పడుకున్నామని ఆయన పేర్కొన్నాడు. ఒక చిన్న రూమ్‌లో తనతో పాటు బిట్టు, పంకజ్ ఇద్దరూ వున్నారని చెప్పాడు. మరో పెద్ద రూమ్‌లో మిగిలిన తొమ్మిది మంది పడుకున్నారని ప్రేమ్ కుమార్ వెల్లడించాడు. రాత్రి 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయని చెప్పాడు. 

బయటికి వెళ్లేందుకు ప్రయత్నించామని.. కానీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని ప్రేమ్ కుమార్ పేర్కొన్నాడు. నేను ఎలాగోలా కిటికీలోంచి బయటకు దూకానని చెప్పాడు. నాకు గాంధీ ఆసుపత్రిలో (gandhi hospital) చికిత్స అందించారని .. మిగతా వారంతా మంటల్లో చిక్కుకుపోయారు ప్రేమ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారని.. అప్పటికే మా వాళ్లంతా సజీవ దహనమయ్యారని ఆయన చెప్పాడు. 

కాగా.. సికింద్రాబాద్ బోయిగూడ fire accident ఘటనలో సజీవ దహనమైన 11 మంది bihar వలస కార్మికులు dead bodyలను నిన్ననే గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి అక్కడి మార్చురీలో భద్రపరిచారు. ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాలను తరలించారు. అక్కడినుంచి రెండు special flightsల్లో పట్నా తీసుకెళ్లారు. పట్నా చేరుకున్న అనంతరం కతిహార్, చాప్రా జిల్లాల్లోని వారి స్వస్థలాలకు మృతదేహాలను తరలించనున్నారు.

బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బోయిగూడలోని స్క్రాప్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి గోడౌన్ లోని సిలిండర్ పేలడంతో మంటలు మరింత ఉదృతమయ్యాయి. మంటలు వేగంగా టింబర్ డిపో, స్క్రాప్ గోడౌన్ మొత్తాన్ని వ్యాపించడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులకు తప్పించుకోడానికి వీలులేకుండా పోయింది. మొత్తం 15 మందిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మిగతా 11మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. 

గోడౌన్ కింది భాగంలో ఉన్న రూమ్ లో ముగ్గురు ఉంటారు. పై భాగంలో మిగిలినవారు ఉంటారు. పై భాగంలో ఉన్న వారు కిందికి రావాలంటే గోడౌన్ మధ్యలో ఉన్న ఇనుప మెట్ల నుండి కిందకు రావాల్సి ఉంటుంది. అయితే మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందిన కారణంగా ఇనుప మెట్ల నుండి ఫై ఫ్లోర్ లో చిక్కుకున్న కార్మికులు కిందకు రాలేకపోయారు. అంతేకాదు ఈ గోడౌన్ కు బయటకు వెళ్లేందుక మరో దారి కూడా లేదు. దీంతో పై ఫ్లోర్‌లో ఉన్న కార్మికులు కిందకు రాలేకపోయినట్టుగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారు బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేంతర్, చింటు, దినేష్, రాజేష్, రాజు, దీపక్, పంకజ్ లుగా గుర్తించారు. మృతులంంతా బీహార్ రాష్ట్రానికి చెందినవారే.