సౌజన్య, ప్రాణదీప్ ప్రేమకథ సుఖాంతం:పెళ్ళిపెద్దలుగా స్నేహితులు
పోలీసుల రక్షణలో పెళ్ళి చేసుకొన్న సౌజన్య, ప్రాణదీప్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రేమికుల పెళ్ళికి అడ్డు చెప్పిన అమ్మాయి బంధవులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రేమికులు పెళ్ళి చేసుకొనేందుకు పోలీసులు సహకరిస్తామని హమీ ఇచ్చారు. దీంతో సౌజన్య, ప్రాణదీప్ లు త్వరలోనే ఒక్కటి కానున్నారు.
రెండు రోజుల క్రితం నిజామాబాద్ ఆర్య సమాజ్లో వివాహం చేసుకొనేందుకు సిద్దమైన సౌజన్య, ప్రాణదీప్లను సౌజన్య కుటుంబసభ్యులు విడదీశారు. మరికొన్నిక్షణాల్లో పెళ్ళి జరుగుతున్న విషయాన్ని తెలుసుకొన్న సౌజన్య తల్లిదండ్రులు, బంధువులు ఆర్య సమాజ్కు చేరుకొని సౌజన్య, ప్రాణదీప్ పై దాడికి దిగారు. సౌజన్యను కిడ్నాప్ చేశారు.
ఈ విషయమై ప్రాణదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాధిత యువతిని కలిశారు. ప్రాణదీప్తో ప్రేమ విషయమై ప్రశ్నించారు. బాధితురాలికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తాను ప్రాణదీప్నే వివాహం చేసుకొంటానని ఆ యువతి పోలీసులకు చెప్పింది. దీంతో సౌజన్యను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. ప్రాణదీప్ కు కూడ కౌన్సిలింగ్ నిర్వహించారు.
తామిద్దరం పెళ్ళి చేసుకొంటామని తేగేసి చెప్పారు. దీంతో వీరిద్దరూ పెళ్ళి చేసుకొనేందుకు సహకరిస్తామని పోలీసులు హమీ ఇచ్చారు. మరో వైపు సౌజన్య, ప్రాణదీప్ పై దాడికి పాల్పడిన సౌజన్య బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు.
శుక్రవారం నాడు ప్రాణదీప్, సౌజన్యల స్నేహితులు పెళ్ళి పెద్దలుగా వ్యవహరించగా ఆర్య సమాజ్లో వీరిద్దరూ పెళ్ళి చేసుకొన్నారు . ఈ పెళ్ళికి సౌజన్య కుటుంబసభ్యులు దూరంగా ఉన్నారు. పోలీసులు ఈ జంటకు రక్షణ కల్పించారు.