వారిద్దరి మధ్య గొడవలు: హైద్రాబాద్లో ప్రేమ జంట మృతిలో సంచలన విషయాలు
హైద్రాబాద్ లెమన్ ట్రీ హోటల్ లో సంతోషీ, రాముల చనిపోయిన ఘటనలో పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. వీరిద్దరూ కొంత కాలం క్రితం రహస్యంగా పెళ్లి చేసుకొన్నారనే ప్రచారం కూడ సాగింది. వీరిద్దరి మధ్య గొడవలను పరిష్కరించుకొనేందుకు వచ్చి చనిపోయారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లెమన్ ట్రీ హోటల్లో ప్రేమ జంట మృతి ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం లగచర్లకు చెందిన సంతోషి, పక్క గ్రామమైన హకీంపేటకు చెందిన గుడిసె రాములు ఒకే స్కూల్లో చదువుకొన్నారు. రాములు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. హైద్రాబాద్ లో నివాసం ఉంటున్నాడు. సంతోషి, రాములు కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. అయితే ఈ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. వీరిద్దరూ కూడ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ పెళ్లికి రాములు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారనే ప్రచారం కూడ సాగిందని సంతోషి కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీంతో సంతోషిని గ్రామం నుండి బయటకు పంపలేదు.
also read:హైదరాబాద్: స్టార్ హోటల్లో శవాలుగా తేలిన ప్రేమ జంట .. ప్రియురాలిని చంపి, ప్రియుడు ఆత్మహత్య
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రిపేర్ కావడం కోసం 15 రోజుల క్రితమే సంతోషి హైద్రాబాద్ కు వచ్చింది. హైద్రాబాద్ లోని హస్టల్లో ఉంటూ కాంపిటిటివ్ పరీక్షలకు సిద్దమౌతోంది. బుధవారం నాడు మధ్యాహ్నం సంతోషి, రాములు మాదాపూర్లోని లెమన్ ట్రీ హోటల్ మూడో అంతస్తులో దిగారు.గురువారం నాడు మధ్యాహ్నం వీరిద్దరూ హోటల్ గదిని ఖాళీ చేయాల్సి ఉంది.
కానీ మరో రోజు ఉంటామని చెప్పారని హోటల్ సిబ్బంది చెప్పారు. గురువారం నాడు సాయంత్రం హోటల్ గది నుండి ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టుగా అరుపులు విన్పించినట్టుగా హోటల్ సిబ్బంది పోలీసుల విచారణలో వెల్లడించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అరుపులు, కేకలు విన్పించలేదు.తమ మధ్య చోటు చేసుకొన్న విబేధాలను పరిష్కరించుకొనేందుకే వారిద్దరూ హోటల్కు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ కారణంగా విచక్షణ కోల్పోయిన రాములు బాత్రూమ్లో సంతోషిని చంపి ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు తెలిపారు.