ఆయూష్ కిడ్నాప్: చిల్లర గొడవే కిడ్నాపర్లను పట్టించింది
:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడేళ్ల బాలుడు ఆయూష్ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు 24 గంటల వ్యవధిలో పట్టుకొన్నారు. అయితే ఈ కిడ్నాపర్ల ఆచూకీ లభ్యం కావడానికి బస్సుల్లో కండక్టర్తో చిల్లర గొడవే ప్రధాన కారణంగా మారింది
హైదరాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏడేళ్ల బాలుడు ఆయూష్ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లను పోలీసులు 24 గంటల వ్యవధిలో పట్టుకొన్నారు. అయితే ఈ కిడ్నాపర్ల ఆచూకీ లభ్యం కావడానికి బస్సుల్లో కండక్టర్తో చిల్లర గొడవే ప్రధాన కారణంగా మారింది. బస్సులో ఈ కిడ్నాపర్లు చిల్లర కోసం గొడవకు దిగకపోతే కిడ్నాపర్ల ఆచూకీ మరింత ఆలస్యమయ్యేదని పోలీసులు భావిస్తున్నారు.
ఆయూష్ను కిడ్నాప్ చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎలా దొరికారనే విషయమై డీసీపీ సుమతి మీడియాకు వివరించారు. ఉత్తర్ప్రదేశ్లోని కనౌజ్ జిల్లా మన్నాపూర్ ప్రాంతానికి చెందిన సంజూ చామర్ కుమారుడు ఆయూష్(4), కుమార్తె అంజలి(7)తో కలసి నగరంలోని బండ్లగూడలో నివసిస్తోంది. జీవనోపాధి లేకపోవడంతో సొంతూరుకు వెళ్లేందుకు సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు తన పిల్లలతో కలసి వచ్చింది.
టిఫిన్ కోసమని తల్లి బయటకు వెళ్లగా బాలుడిని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. గోపాలపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే రంగంలోకి దిగిన నార్త్జోన్ పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయూష్ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు సుచిత్ర జంక్షన్ వద్ద హకీంపేట డిపోకు చెందిన 25 ఎస్ బస్సులో ఎక్కారు. రైల్వే స్టేషన్కు వెళ్లేందుకుగాను టికెట్కు అవసరమైన చిల్లర డబ్బులు లేకపోవడంతో గొడవ పడ్డారు.
డ్రైవర్ నర్సింహులు కల్పించుకుని టికెట్ రేటు రూ.30 చెల్లించి చిల్లర తీసుకోవాలని సూచించాడు. అయితే టిక్కెట్టు రూ.10.. అయితే రూ.30 తీసుకొంటున్నారని ఆ మహిళలు గొడవకు దిగారు. సీసీపుటేజీ ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ఈ క్రమంలో బస్సు డ్రైవర్ కు వీరిద్దరి ఫోటోలను చూపడంతో అతను గుర్తుపట్టాడు. అల్వాల్ అంబేద్కర్ నగర్కు చెందిన యాదమ్మ, జయమ్మలుగా గుర్తించారు.
మంగళవారం ఉదయం పూట పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఇద్దరు నిందితుల ఆచూకీ లభ్యమైంది. వీరి వద్ద ఆయూష్తో పాటు
శేఖర్, రేణుక అనే ఇద్దరిని కూడ పోలీసులు గుర్తించారు.వీరిద్దరిని మేడ్చల్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ చేసినట్టు నిందితులు ఒప్పుకొన్నారు.
ఈ వార్తలు చదవండి
7 ఏళ్ల ఆయూష్ ఆచూకీ దొరికింది: కిడ్నాపర్ అరెస్ట్
షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు