వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. జూబ్లీహిల్స్ పీఎస్కు విజయమ్మ.. పోలీసులపై ఆగ్రహం..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు ఆమెపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసినందుకు ఆమెపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం షర్మిల జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఉన్నారు. ఇక, ఈరోజు ఉదయం షర్మిలను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై విచారణ జరుపుతున్న సిట్ కార్యాలయానికి వెళ్తుందనే అనుమానంతో ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అయితే ఈ పరిణమాలపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను నెట్టుకుంటూ ముందకు కదిలారు. దీంతో పోలీసులకు, షర్మిలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే పోలీసులను దాటుకుని వాహనంలో బయటకు వచ్చిన షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే షర్మిల పోలీసులను తోసివేశారు. ఈ క్రమంలోనే ఓ ఎస్సై మీద కూడా షర్మిల చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పలువురు మహిళా పోలీసులు షర్మిలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమె రోడ్డుపై బైఠాయించారు. తనకు సమాధానం చెప్పేవరకు తాను అక్కడి నుంచి కదలనని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎష్ షర్మిల అంటే కేసీఆర్కు భయం పట్టుకుందని అన్నారు. తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తనను ఆపడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. వ్యక్తిగత పనులకు కూడా తనను బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Also Read: అడ్డగింత.. ఎస్సై, కానిస్టేబుళ్లను కొట్టిన షర్మిల.. అరెస్ట్..!! (వీడియో)
రోడ్డు మీదక నడుచుకుంటూ వచ్చిన షర్మిలను పలువురు మహిళా పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే షర్మిల మాత్రం ముందుకే సాగారు. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్పై షర్మిల చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.
పోలీసు స్టేషన్కు వైఎస్ విజయమ్మ..
వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించడంతో ఆమె తల్లి విజయమ్మ పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. పోలీసు స్టేషన్లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరుపై విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతురుని చూడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్ ఎదుటే తన వాహనం వద్దే ఉండి నిరసన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ అంశంపై నిరసన తెలిపేందుకు బయటకు వెళ్తుండగా తన కూతురిని అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. పనిలేక షర్మిలను అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టుగా తెలిపారు.