యూట్యూబ్ లో చూసి బైక్ చోరీలు.. చివరకు..!
వీధుల్లో, ఇళ్లముందు పార్క్ చేసి ఉన్న వాహనాలను గుర్తించి చోరీలు చేస్తారు. వాటిని గుంటూరుకు తరలించి మధుకు విక్రయిస్తారు.
టెక్నాలజీని ఉపయోగించుకొని జీవితంలో ముందుకు వెళ్తున్న వారు కొందరైతే.. అదే టెక్నాలజీని ఉపయోగించి కొందరు తప్పుదోవ పడుతున్నారు. తాజాగా అలాంటి గ్యాంగ్ ఒకటి పోలీసులకు చిక్కింది. యూట్యూబ్ లో చూసి.. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితులు హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండ, గుంటూరు జిల్లాలో వాహనాలను చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి 8 స్పోర్ట్స్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు (18), చింతగుంట శివనాగ తేజ (22), నరసరావుపేట నివాసి గొల్ల మధు (28) ఓ గ్యాంగుగా ఏర్పడ్డారు. వారిలో చందు, నాగతేజలు ద్విచక్ర వాహనాలను చోరీ చేయగా గొల్ల మధు వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడు.
వీధుల్లో, ఇళ్లముందు పార్క్ చేసి ఉన్న వాహనాలను గుర్తించి చోరీలు చేస్తారు. వాటిని గుంటూరుకు తరలించి మధుకు విక్రయిస్తారు. ఇదే విధంగా ఆసి్ఫనగర్ పీఎస్ పరిధిలోనూ ఓ స్పోర్ట్స్ బైక్ చోరీకి గురైంది. దానిపై దర్యాప్తు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా యూట్యూబ్ ద్వారా వీడియోలు చూసి స్పోర్ట్స్ బైకులను చోరీ చేయడానికి పలు టెక్నిక్లను నేర్చుకున్నట్లు వెల్లడించారు.