తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ : 19న ప్రధాని మోడీ, 28న అమిత్ షా.. ఎన్నికలపై దిశానిర్దేశం చేసే ఛాన్స్
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా పార్టీ అగ్రనేతలు తెలంగాణకు రానున్నారు. ప్రధానంగా 19న ప్రధాని మోడీ, 28న అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 28న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలతో భేటీకానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా ఆయన పర్యటన సాగనుంది. తెలంగాణ ఎన్నికల సమాయత్తంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సంఘ్ నేతలతోనూ ఆయన సమావేశం అయ్యే అవకాశం వుంది. గతేడాది 5 సార్లు తెలంగాణ వచ్చారు అమిత్ షా. మరోవైపు ఈ నెల 19న హైదరాబాద్కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని ప్రారంభించనున్నారు . అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కూడా ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్ దగ్గరే మోడీ ప్రసంగం వుండే అవకాశం వుంది.
ఇదిలావుండగా ఈ నెల 8న అమిత్ షా ఏపీలో పర్యటించాల్సి వుంది. అయితే అదే రోజున కర్ణాటకలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 8న కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అమిత్ షా పర్యటించాల్సి వుంది. తిరిగి ఆయన ఎప్పుడు ఏపీలో పర్యటిస్తారన్నది త్వరలోనే బీజేపీ నేతలు ప్రకటించనున్నారు.
ALso REad: టార్గెట్ 90 సీట్లు: తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు పాలక్ లను నియమించిన బీజేపీ
ఇకపోతే.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుడు అయినప్పటికీ, ఈ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని అన్నారు. వారి పదవీకాలంలో, అవినీతి గరిష్ట స్థాయికి చేరుకుందని ఆరోపించారు. మధ్యవర్తులు, గిరిజన భూములను కబ్జా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాలన కారణంగా జార్ఖండ్ నాశనమైందని అన్నారు. విద్య, రోడ్డు, విద్యుత్ వంటి అన్ని రంగాల్లో మేం పనిచేశామని పేర్కొన్న అమిత్ షా.. తమ తర్వాత వచ్చిన ప్రభుత్వం జార్ఖండ్ను నాశనం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వతహాగా గిరిజనుడే అయినా ప్రభుత్వం గిరిజన వ్యతిరేకిగా నడుస్తున్నదని ఆరోపించారు. నేడు జార్ఖండ్లో గిరిజన మహిళలకు బలవంతంగా పెళ్లిళ్లు చేసి వారి భూములను లాక్కుంటున్నారన్నారు. జార్ఖండ్ ప్రజలు మేల్కొన్నారనీ, ఇప్పుడు ఈ అన్యాయాన్ని సహించేది లేదని పేర్కొన్నారు.