ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు విచ్చేశారు. ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. అంతకంటే ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. చిరునవ్వుతో వారిని పలకరించారు. వారితో కాసేపు మాట్లాడిన ప్రధాని మోదీ.. వారిలో ఉత్సాహం నింపారు. కొందరు విద్యార్థులను భుజం తట్టి అభినందించారు. 

ప్రధాని మోదీ వెంట కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా ఉన్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనేందుకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. 

ఇదిలా ఉంటే.. పరేడ్ గ్రౌండ్స్ నుంచి వర్చువల్‌గా తెలంగాణలో రూ.11,300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. 7,864 కోట్లతో ఆరు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అత్యాధునిక వసతుల కల్పనకు ప్రధాని భూమిపూజ చేయనున్నారు.

బేగంపేట ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం.. 
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి.. తదితరులు స్వాగతం పలికారు.