తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ:పవన్ స్పందన ఇదీ...
తెలంగాణలో మరో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది . ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ విధి విధానాలను ఆమె ఇవాళ ప్రకటిస్తారు.
హైదరాబాద్:తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్వాగతం తెలిపారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో తనకు పార్టీ నడిపే బలం లేదన్నారు.తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఇవాళ కొత్త పార్టీ ఏర్పాటు వెనుక ఉద్దేశ్యాలను వివరించనున్నారు.
ప్రజలకు మంచి చేయడానికి ఎవరొచ్చినా కూడ స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. 2007 నుండి తాను రాజకీయాల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ గడ్డ అని ఆయన చెప్పారు. కొత్త రక్తం, చైతన్యవంతమైన యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.జనసేన తరపున వారిని గుర్తించి మద్దతిస్తామని ఆయన చెప్పారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పగటి కలలు కనేవాడిని కానని చెప్పారు. రాజకీయ వారసత్వంతో సంబంధం లేదని వారు కూడ రాజకీయాల్లోకి రావాలన్నారు.
also read:ఇడుపులపాయలో వైఎస్ షర్మిల: తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాతో ప్రార్ధనలు
ఇవాళ ఉదయం కడప జిల్లాలోని ఇడుపులపాయ వద్ద తన తండ్రి సమాధి వద్ద తన పార్టీకి చెందిన జెండాను ఉంచి షర్మిల ప్రార్ధనలు చేశారు. కడప నుండి ప్రత్యేక విమానంలో ఆమె హైద్రాబాద్ వచ్చి పార్టీ విధి విధానాలను వివరించనున్నారు.తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన షర్మిల ఇప్పటికే కసరత్తును పూర్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆమె సమావేశాలు నిర్వహించారు.
ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ఆమె క్షేత్రస్థాయిలో కూడ పర్యటించారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ షర్మిలతో విబేధించారు. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణలో పార్టీ ఏర్పాటును జగన్ వ్యతిరేకించారని ఆ పార్టీ నేతలు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.