హైదరాబాద్ మెట్రో...మరో రికార్డు
తాము అనుకున్నదానికంటే ముందుగానే రెండు కోట్ల ప్రయాణికుల మార్కును చేరుకున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు మరో రికార్డు సృష్టించింది. హైదరాబాద్ మెట్రోరైలులో ప్రయాణించినవారి సంఖ్య మంగళవారంతో 2 కోట్లకు చేరుకుందని ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ ఎండీ కెవీబీ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తాము అనుకున్నదానికంటే ముందుగానే రెండు కోట్ల ప్రయాణికుల మార్కును చేరుకున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న నాగోల్-అమీర్పేట్-మియాపూర్ మార్గంతోనే ఈ ఘనత సాధించామని, అమీర్పేట్-ఎల్బీనగర్ మార్గంలో ప్రయాణసౌకర్యాలు ప్రారంభించిన తర్వాత ఈ సంఖ్య మరిన్ని రెట్లు పెరగగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఉచిత మంచినీటి సదుపాయం, విశ్రాంత గదులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
రైళ్ల రాకపోకల సమాచారాన్ని రైలుతో పాటు ప్లాట్ఫామ్లపై కూడా ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు మెట్రో దిగిన ప్రయాణికులకు ఇంటికి, కార్యాలయాలకు చేరుకునేందుకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. నాగోల్-అమీర్పేట్-మియాపూర్ మెట్రోను 2017 నవంబరు 28న ప్రధాని మోదీ ప్రారంభించగా నవంబరు 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.