Asianet News TeluguAsianet News Telugu

పరుపాటి వెంక‌ట్రామి రెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం  

Parupati Venkatrama Reddy Biography: 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంటు నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున మాజీ ఐఏఎస్‌, రిటైర్డ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్సీ పి.వెంకట్రామారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలు మీ కోసం.. 

Parupati Venkatrama Reddy Biography, Childhood, Family, Education, Political Life, Net Worth, Key Facts KRJ
Author
First Published Apr 1, 2024, 5:32 AM IST

Parupati Venkatrama Reddy Biography: ఆయన ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి, పదేళ్లపాటు కలెక్టర్‌గా, జేసీగా, పీడీగా బాధ్యతలు నిర్వహించారు. కానీ, ప్రజలకు ప్రత్యేక్షంగా సేవ చేయాలనే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఈ తరుణంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మెదక్‌ పార్లమెంటు నుంచి బిఆర్‌ఎస్‌ పార్టీ తరుఫున ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనే పరుపాటి వెంక‌ట్రామి రెడ్డి( పీ.వెంకట్రామారెడ్డి). ఈ నేపథ్యంతో ఆయన రియల్ స్టోరీ తెలుసుకుందాం.  

కుటుంబ నేపథ్యం

పరుపాటి వెంక‌ట్రామి రెడ్డి .. 1962, సెప్టెంబర్ 21న తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, ఇందుర్తి గ్రామంలో జన్మించారు. పరిపాటి రాజిరెడ్డి, పుష్పలీల దంపతులకు ఎనిమిది మంది సంతానం ఒకరు వెంక‌ట్రామి రెడ్డి. వీరిది ఉమ్మడి కుటుంబం. ప్రస్తుతం వీరి కుటుంబం  మెదక్‌ పార్లమెంటు పరిధిలోని తెల్లాపూర్‌లో నివాసముంటుంది. ఇందులో వెంకట్రామారెడ్డితోపాటు సత్యనారాయణరెడ్డి సైతం ఐఏఎస్‌ అధికారులుగా పదవీ విరమణ చేశారు. మిగితా అన్నదమ్ములు రాజపుష్ప సంస్థను నిర్వహిస్తున్నారు. ఆస్తులు రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు తండ్రి రాజిరెడ్డి, తల్లి పుష్పలీల పేరు కలిసివచ్చేలా ’రాజ్‌పుష్ప’ అని పేరు పెట్టారు. ఆయన భార్య పేరు ప్రణీత రెడ్డి. వీరికి ఇద్దరు సంతానం.. కుమారుడు భరద్వాజ్‌రెడ్డి, కూతురు రుత్విక రెడ్డి

వృత్తి జీవితం 

వెంకట్రామా రెడ్డి వృత్తి విషయానికి వస్తే.. మొదట్లో న్యాయవాదిగా పని చేసిన ఆయన.. 1996లో గ్రూప్-1కు ఎంపికై ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని బందరు, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోగా పని చేశారు. ఆ తరువాత  2002 నుండి 2004 వరకు మెదక్‌ ఉమ్మడి జిల్లా డ్వామా పీడీగా పని చేశాడు. వెంకట్రామి రెడ్డి హుడా సెక్రటరీగా, జిహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్‌గా పని చేసి 2007లో ఐఏఎస్‌ హోదా పొందాడు.

కలెక్టర్‌గా.. 

అనంతరం మార్చి 24, 2015 నుంచి అక్టోబర్ 10 2016 వరకు ఉమ్మడి మెదక్ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేసి ఆయన తెలంగాణలో జిల్లాల పునర్విభజన తరువాత 2016, అక్టోబర్ 11 నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు పి.వెంక‌ట్రామి రెడ్డి . ఇక 2018 సార్వత్రిక ఎన్నికల సమయంలో 8 నెలల పాటు సిరిసిల్ల కలెక్టర్‌గా, తర్వాత సిద్దిపేట కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఇక 2020 దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో 15 రోజుల పాటు సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించి, ఎన్నికల అనంతరం తిరిగి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.  ఇదిలా ఉంటే.. 
ప్రజలకు ప్రత్యేక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతో వెంక‌ట్రామి రెడ్డి .. నవంబర్ 15, 2021న ఐఎఎస్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు.

రాజకీయ జీవితం 

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యం కావాలని ఉద్యోగానికి రాజీనామా చేసి వెంక‌ట్రామి రెడ్డి గారు 2021, నవంబర్ 16న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) లో చేరాడు. ఈ తరుణంలో ( నవంబర్ 2021లో) జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై ఎన్నికయ్యాడు. వెంకట్రామారెడ్డి విశ్వసనీయత, పట్టుదలను మెచ్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రస్తు తం మెదక్‌ పార్లమెంటు బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దించారు. 

వివాదాలు

సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామా రెడ్డి ఆనాటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి కాళ్లు మొక్కడం ఏంటంటూ సోషల్ మీడియాలో విమర్శలు రాగా.. శుభకార్యం వేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమన్నారు. కేసీఆర్ తన తండ్రి లాంటి వారని.. అలాంటి వ్యక్తి కాళ్లు మొక్కడంలో తప్పేముందని వెంకట్రామా రెడ్డి ప్రశ్నించారు.

మరోకటి.. కలెక్టర్ పదవి విరమణ చేసిన వెంకట్రామా రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో  ఆ పార్టీ అధినేత, ఆనాటి సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వెంకట్రామారెడ్డిని కొందరు ప్రతిపక్ష నేతలు తెలంగాణ అదానీ అని పిలుస్తుండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios