మళ్లీ తెరపైకి అసెంబ్లీ నియోజకవర్గాలు పెంపు అంశం
తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సిందేనని హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పలు అంశాలపై కేంద్రానికి సిఫారసు చేసింది.
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంశం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అయితే పెంపు సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చెయ్యడంతో ఆ విషయం కాస్త మరుగునపడిపోయింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాల్సిందేనని హోంశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర మాజీ హోం శాఖ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం పలు అంశాలపై కేంద్రానికి సిఫారసు చేసింది.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకపోవ డం, ప్రత్యేక ప్యాకేజీకి స్వల్పంగా నిధులు కేటాయించడం, రెవెన్యూలోటు భర్తీలో భారీ కోతలు విధించడం, ప్రజాహితం కోసం పెట్టిన ఖర్చులను కూడా తిరస్కరించడం, రాజధానికి నిధుల కేటాయింపులో సమతుల్యత పాటించకపోవడం వంటి అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పార్లమెంటులో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చెయ్యాల్సిందేనని పట్టుబట్టింది. నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి కేవలం రూ.1,500కోట్లు ఇవ్వడంపై మండిపడింది.
పార్లమెంటు సమావేశాల చివరి రోజు ఈ నివేదికను ఖరారు చేసేందుకు కమిటీ సమావేశమైంది. తమ వాదనలు కూడా చేర్చాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టడంతో సమావేశం నిరవధిక వాయిదా పడింది.