సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో.. పంచాయతీ ఉద్యోగుల మందు, చిందు..
కరోనా నిబంధనలను ఖాతరు చేయకుండా 22 మండలాల పంచాయతీ ఉద్యోగులు మాంసం, మందు, చిందుతో ఎంజాయ్ చేశారు.
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో పంచాయతీ ఉద్యోగులు మందు తాగుతూ.. చిందులు వేస్తూ రెచ్చిపోయారు. ఏకంగా పని వేళల్లోనే భారీగా పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పార్టీలో దాదాపు 22 మండలాలకు చెందిన పంచాయతీ ఉద్యోగులు ఈ పార్టీకి హాజరు కావడం గమనార్హం.
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేం ద్రం శివారులోని ఓ మామిడి తోటలో శుక్రవారం ఈ విందు జరిగింది. కరోనా నిబంధనలను ఖాతరు చేయకుండా 22 మండలాల పంచాయతీ ఉద్యోగులు మాంసం, మందు, చిందుతో ఎంజాయ్ చేశారు. విషయం మీడియాకు తెలియడంతో అక్కడికి వెళ్లగా, ఉద్యోగులంతా పరుగులు తీశారు.
పంచాయతీ కార్యదర్శులంతా డబ్బులు వేసుకుని ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇందులో మహిళా ఉద్యోగులూ పాల్గొన్నట్టు సమాచారం. కాగా మందు పార్టీ వ్యవహారంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపాక ఎంపీవో నరసింహారావును సస్పెండ్ చేశారు. ఎంపీడీవో రాజేష్ను బదిలీ చేశారు.