ఇక నుంచి సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించం: ఎమ్మెల్సీ పల్లా
బీజేపీ నేతలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రగతిని కొందమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన దేశంలో అమలు పరుస్తున్న రైతు బంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని పల్లా పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను అనేక రాష్ట్రాలు, చూసి నేర్చుకుంటున్నాయన్నారు. దీనిని ప్రగతి అనకూండా ఏమంటారో ప్రతిపక్షాలు చెప్పాలని ఈ సందర్భంగా పల్లా డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా బీజేపీ ఎంపీలు వ్యవహరిస్తోన్నారనీ, వారు శిఖండ్లులా అడ్డు పడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేస్తుంటే సహకరించాల్సింది పోయి.. ప్రతి పక్షాలు దుష్ట శక్తుల్లా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.50 వేలకోట్లు వేశామనీ. రైతులకు సహాయం చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
అలాగే.. రైతు బీమా పథకం కింద రాష్టంలో ఇప్పటివరకు 70,714 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం పొందారని, ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. రాష్ట్రంలో లేని ఆత్మహత్యలను ఉన్నట్లుగా ప్రతిపక్షాలు సృష్టిస్తోన్నాయని పల్లా ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి ప్రతిపక్ష పార్టీలు ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరమని అన్నారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులనూ కూడా విమర్శించడం సరికాదనీ, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిపై ఆధారపడి పనిచేయడం లేదన్నారు. ప్రతి పక్షాలు సహకరించినా…లేకపోయినా.. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దీని కోసం ఆయన ఎంతదూరమైన పోతారని అన్నారు.
Read Also: అరుదుల్లోకెల్లా అరుదు.. వారిద్దరూ ట్విన్స్.. కానీ, వేర్వేరు సంవత్సరాల్లో జన్మించారు..!
సీఎం కేసీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే సహించేది లేదని, వారు వాడుతున్న బాషను చూసి ప్రజలు అసహించుకునే పరిస్థితి తలెత్తుతోందని, అయినా విపక్షాల తీరులో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. ఇక నుంచి సీఎం కేసీఆర్ పై పరుష పదజాలాన్ని ఉపయోగించినా.. విమర్శలు చేస్తే.. మౌనంగా ఊరుకోమని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని, ప్రజల పట్ల అంత నిజాయితీ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. సిఎం కెసిఆర్ పైనో.. మంత్రి కెటిఆర్ పైనో ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే .. హీరోలు అవుతామని ఫీల్ కాదన్నారు. అలాంటి వారు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఎప్పటికి జీరోలేనని అన్నారు.
Read Also: బండి సంజయ్కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్.. కేసులకు భయపడొద్దని భరోసా..
టిఆర్ఎస్ పార్టీ వారం రోజుల పాటు రైతుబంధు వేడుకలను ఘనంగా నిర్వహించాలని తలపెట్టిందన్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో నిబంధనలకు లోబడి తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.. తాము సంబరాలు చేసుకోవాలని పిలుపును ఇస్తే కొందరు కుహనా రాజకీయ నాయకులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై కూడా విమర్శలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బంధు వల్ల రైతులు సోమరిపోతులు అవుతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. తెలంగాణ రైతాంగాన్ని కించపర్చేలా బండి సంజయ్ మాట్లాడారని మండిపడ్డారు.