గాంధీ ఆస్పత్రిలో అధికారుల మందు పార్టీ.. కాసేపటికే ఒకరు మృతి
సెల్లార్లో గంటలతరబడి విందు చేసుకుంటే ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సెల్లూర్ లో అధికారులు మందు పార్టీ చేసుకున్నారు. కాగా.. మందు పార్టీ చేసుకొని ఇంటికి వెళ్లిన కాసేపటికే ఓ అధికారి మృతి చెందడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మద్యం తాగి అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు విందు చేసుకున్నారని తెలిసింది. తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు.
ఓ వ్యక్తి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెపోటుతో చనిపోయాడు. విందు వ్యవహారం ఆస్పత్రి ఉన్నతాధికారులకు తెలియడంతో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలోకి మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి.. సెల్లార్లో గంటలతరబడి విందు చేసుకుంటే ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్పత్రిలో అడుగడుగునా బందోబస్తు ఉన్నప్పటికీ విందు విషయం పోలీసులు తెలుసుకోలేకపోయారు. లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు.
ఈ ఘటనకు సంబంధించి తమకు పూర్తి సమాచారం లేదని చెప్పారు. ఆదివారం తాము కేవలం రెండు గంటలు మాత్రమే విధుల్లో పాల్గొన్నామని చెప్పారు. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చనిపోయినట్లు మాత్రం తెలిసిందన్నారు. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.