ఓయూకు తలనొప్పిగా మారిన డాక్టరేట్లు

శతాబ్ధి ఉత్సవాలకు రెడీ అవుతోన్న ఉస్మానియా యూనివర్సిటీకి కొత్త తలనొప్పులు వచ్చాయి.వచ్చే ఏప్రిల్ లో ఓయూ శతాబ్ధి ఉత్సవాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా ఆహ్వానించారు.

ఇదంతా బాగానే ఉంది. కానీ, 100 ఏళ్ల ఉత్సవం సందర్భంగా మా నేతకు అంటే మా నేతకు గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ఓయూకు వందలాది మంది విజ్ఝప్తులు అందజేశారు. ఇప్పటివరకు దాదాపు 50 కి పైగా విజ్ఞప్తులు తమకు వచ్చాయని ఓయూ అధికారులు తెలిపారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌కు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని మొదట ఓయూ పాలకమండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సీఎం అందుకు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.

ఇప్పటి వరకు కేసీఆర్ కు గౌరవ డాక్టరేట్ ఇస్తారా లేదా అనేది స్పష్టం కాలేదు. ఈలోపే మరో 50 మందికి గౌరవ డాక్టరేట్లు ఇవ్వాలని ఓయూకు దరఖాస్తులు అందాయి.ఇదే ఇప్పుడు వర్సిటీకి తలనొప్పిగా మారింది.

ఇలా గౌరవ డాక్టరేట్ల రేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఉండటం గమనార్హం.ఆమెకు కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని జాగృతి నేతలు ఓయూ వైస్ చాన్సెలర్ కు మెమోరాండం సమర్పించారు.

అంతేకాదు, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామికి, ప్రజా గాయకుడు గద్దర్‌కు కూడా డాక్టరేట్ ఇవ్వాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ కోరింది.ఇక కాంగ్రెస్ నేతలు తమ అధినేత్రి సోనియా గాంధీకి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారికి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని ఓయూ జేఏసీ నేతలు కోరుతున్నారు.కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్‌కు కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వాలని మరికొందరు కోరారట.