Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఇవాళ రెండే కేసులు నమోదు: తగ్గింది కదా అని నిర్లక్ష్యం వద్దన్న కేసీఆర్

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదుకావడంతో ప్రభుత్వ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇవాళ నమోదైన రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. 

only 2 positive coronavirus cases reported in telangana
Author
Hyderabad, First Published Apr 27, 2020, 8:42 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. సోమవారం కొత్తగా కేవలం 2 కేసులు మాత్రమే నమోదుకావడంతో ప్రభుత్వ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇవాళ నమోదైన రెండు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. ఈ రోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1003కు చేరుకుంది.

ఇప్పటి వరకు 25 మంది మరణించగా, 332 మంది కోలుకోవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 646కు చేరుకుంది. సోమవారం 16 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరోవైపు రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుండడం శుభసూచకమని, రాబోయే కొద్ది రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాలు ఒక్క కరోనా ఆక్టివ్ కేసు కూడా లేని జిల్లాలుగా మారుతున్నాయని సిఎం ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన వారిలో కూడా  97 శాతానికి పైగా పేషంట్లు కోలుకుని, డిశ్చార్జి అవుతుండడం మంచి పరిణామమన్నారు.

వైరస్ వ్యాప్తి, ప్రభావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటైన్మెంట్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు ప్రకటించారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించి, అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతున్నదని వెల్లడించారు.

ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ధోరణి (ట్రెండ్) చూస్తుంటే వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గిందన్నారు. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ పాజిటివ్ కేసులు వచ్చినా, వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్ని విధాలా సంసిద్ధంగా ఉందని సిఎం ప్రకటించారు. 

సోమవారం ప్రధానమంత్రితో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios