పేలిన గ్యాస్ సిలిండర్.. కవలల్లో ఒకరు మృతి
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. కవల పిల్లల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. కవల పిల్లల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపల్లెకు చెందిన గ్రంథి చిన్నయ్య దంపతులకు ఇద్దరు కవలపిల్లలు. శ్రీలక్ష్మీ, మహేశ్వరిలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నారు.
బుధవారం చిన్నయ్య భార్య ఇంట్లో వంట చేస్తూ.. మధ్యలో స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో ఆ ఇద్దరు పిల్లలు ఇంట్లో మంచంపై కూర్చొని ఆడుకుంటున్నారు. ఇక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. కవలలో ఒకరైన శ్రీలక్ష్మి(8) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో బాలిక మహేశ్వరిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
మహేశ్వరి.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే.. తన సోదరి గురించి ఆరా తీయడం.. అక్కడి వారిని కలచివేసింది. పిల్లల తల్లిదండ్రులు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.