Telangana: సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లల్లో 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' స్టాల్స్ ప్రారంభించారు. రైల్వే స్టేషన్లను స్థానిక ఉత్పత్తుల విక్రయాలు మరియు ప్రచార కేంద్రంగా మార్చే లక్ష్యంతో "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రాలను దక్షిణ మధ్య రైల్వే (SCR)లోని ఆరు ప్రధాన స్టేషన్లలో ప్రారంభించారు.
One station One Product: రైల్వే స్టేషన్లను స్థానిక ఉత్పత్తుల విక్రయాలు మరియు ప్రచార కేంద్రంగా మార్చే లక్ష్యంతో "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రాలను దక్షిణ మధ్య రైల్వే (SCR)లోని ఆరు ప్రధాన స్టేషన్లలో ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లల్లో 'వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్' స్టాల్స్ ప్రారంభించారు. స్థానికంగా తయారు చేయబడే వస్తువులను ఈ కేంద్రాల్లో విక్రయించనున్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం, వాటి అమ్మకాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టనుందని గతంలో ప్రకటించింది. ఈ చొరవతో దక్షిణమధ్య రైల్వేలో "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని ఒక స్టేషన్లో పైలట్ ప్రాజెక్ట్ ను మొదటగా ప్రారంభించారు. ప్రజల నుంచి దీనికి మంచి స్పందన వచ్చింది. "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రానికి వచ్చిన స్పందనతో ప్రోత్సాహంతో.. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, ఔరంగాబాద్ స్టేషన్లతో పాటు హైదరాబాద్లోని సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో కూడా మొదటిసారిగా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైదరాబాదీ మంచినీటి ముత్యాల ఆభరణాలు, గాజులు విక్రయిస్తుండగా, కాచిగూడ స్టేషన్లో పోచంపల్లిలో చేనేత వస్త్రాలు, ఇతర ప్రత్యేక చేనేత వస్త్రాలు విక్రయానికి ఉంచారు. అందరికి కనిపించేలా ప్రధాన ప్రయాణీకుల ఇంటర్ఫేస్ ప్రాంతంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు.
తొలిసారిగా చేపట్టిన కార్యక్రమం కావడంతో శనివారం నుంచి 30 రోజుల పాటు కొనసాగించనున్నారు. అమలు చేస్తున్నారు. తిరుపతిలో ఇప్పటికే అమలులో ఉన్న ప్రాజెక్టును ఇప్పుడు మరో 30 రోజులు పొడిగించారు. ప్రజల నుంచి స్పందనను బట్టి ఈ స్టాల్స్ ఉంచే సమయం పెంచుతున్నారు అధికారులు. యూనియన్ బడ్జెట్ 2022-23లో "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రాల కాన్సెప్ట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించారు. భారీ ఫుట్ఫాల్స్ను చూసే రైల్వే స్టేషన్లు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మార్కెటింగ్ ఛానెల్లుగా పనిచేస్తాయని, తద్వారా స్థానిక చేతివృత్తులవారు, కుమ్మరులు, చేనేత కార్మికులు మరియు గిరిజనులు మొదలైన వారి జీవనోపాధి మరియు సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహాన్ని ఇస్తారు.
దక్షిణ మధ్య రైల్వేలోని మొత్తం ఆరు డివిజన్లు ఈ "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" కేంద్రాల చొరవను అమలు చేయడానికి తమ అధికార పరిధిలో ఒక ప్రధాన స్టేషన్ను గుర్తించాయి. ప్రాజెక్ట్ను అమలు చేయడానికి, స్థానిక దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఆసక్తి ఉన్న స్థానికులు, చేతివృత్తులవారు, వ్యాపారులు మొదలైన వారి నుండి దరఖాస్తులను పిలిచారు. స్థానిక హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, తద్వారా తమ ఉత్పత్తుల పరిధిని విస్తరించేందుకు మంచి అవకాశం ఉంటుందని జనరల్ మేనేజర్ (ఇన్ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. నామినేటెడ్ స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి రైల్వే స్టేషన్లు బాగా సరిపోతాయని ఆయన తెలిపారు.
