కోట్ల ప్రభుత్వ భూమి తీసుకెళ్లి.. వెలుగులోకి మాజీ తహసీల్దార్ అక్రమాలు
నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీడీ డీజీనీ ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినియోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చేస్తున్న అక్రమాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా మరో విషయం లో అతనిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కె. ధర్మారెడ్డి అతని మనుషులకు అక్రమంగా ఇచ్చేయడం గమనార్హం. ఈ విషయంలో విజిలెన్స్ విభాగం నివేదికలో తేలింది.
దీని ఆధారంగా నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏసీడీ డీజీనీ ఆదేశించింది. దీంతో ఏసీబీ అధికారులు కుట్ర, అధికారదుర్వినియోగం ఆరోపణల కింద శుక్రవారం నాగరాజుతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని రాంపల్లి గ్రామపరిధిలో సర్వే నం621లో కందాడి లక్ష్మమ్మ పేరిట 14 గుంటలు, సర్వే నెం.623లో కందాడి బుచ్చిరెడ్డికి 33 గుంటలు, సర్వే నెం.625లో కందాడి మీనమ్మ పేరిట 19 గుంటలు, సర్వే నం.633ఏలో కందాడి ధర్మారెడ్డి పేరిట ఎకరం రెండు గంటలకు జులై9వ తేదీన అప్పటి తహసీల్దార్ గా ఉన్న నాగరాజు నిబంధనలకు విరుద్దంగా డిజిటల్ సైన్లతో పాసుబుక్కులు జారీ చేశాడు.
నాగరాజు మరికొందరితో కలిసి మొత్తంగా 24 ఎకరాల 16 గుంటల భూములకు నకిలీ పత్రాలు సృష్టించి, రికార్డులు తారుమారు చేసి ఈ నేరానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ విషయం కీసర ఆర్డీవో వద్ద ఇప్పటికే పెండింగ్లో ఉన్నా అతనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం.. ఈ భూముల ధర రూ.2.68 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో విలువ రూ.48.8 కోట్లుగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.