తెలంగాణలో ఇప్పటివరకు 20 ఒమిక్రాన్ (Omicron) పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బాధితులను గచ్చిబౌలిలోని టిమ్స్‌‌లో (TIMS Gachibowli) ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు 20 ఒమిక్రాన్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితులను గచ్చిబౌలిలోని టిమ్స్‌‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తిని గచ్చిబౌలిలోని టిమ్స్‌ (TIMS Gachibowli) నుంచి మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీలో ఆ వ్యక్తికి చికిత్స కొనసాగుతుంది. 

మరోవైపు టిమ్స్‌లో ఉన్న మిగిలిన Omicron బాధితుల ఆరోగ్యం స్థిరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుల కాంటాక్ట్స్ ట్రేసింగ్, టెస్టింగ్ కొనసాగుతుంది. వారి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు పరీక్షలు జరుపుతున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో నమోదైన 20 ఒమిక్రాన్ కేసుల్లో.. నాలుగు మాత్రమే ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారిలో గుర్తించినవి. మిగిలిన 16 మంది నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చినవారేనని వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి.

హాట్‌స్పాట్‌ గా మారిన పారామౌంట్ కాలనీ
హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని పారామౌంట్ కాలనీ హాట్‌స్పాట్ గా మారింది. విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులు వైద్యం కోసం, ఇతరత్రా అవసరాల రీత్యా హైద్రాబాద్ కు వచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఎక్కువ మంది పారామౌంట్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఈ కారణంగానే పారామౌంట్ కాలనీలోని సుమారు వెయ్యి మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్టుగా వైద్య శాఖాధికారులు తెలిపారు. 

భారత్‌లో 161కి చేరిన ఒమిక్రాన్ కేసులు..
భారతదేశంలో సోమవారం నాటికి ఒమిక్రాన్ కేసుల సంఖ్య 161కి చేరింది. ఇప్పటివరకు మహారాష్ట్ర (54), ఢిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (19), తెలంగాణ (20), గుజరాత్ (11), కేరళ (11), ఆంధ్ర ప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) మరియు పశ్చిమ బెంగాల్ (4) ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.