బాకీ డబ్బుల కోసం స్నేహితుడి దారుణహత్య
మంగళవారం పాతబస్తీలో జరిగిన యువకుడి దారుణహత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన వివాదం కారణంగానే హత్య జరిగిందని తేల్చారు
మంగళవారం పాతబస్తీలో జరిగిన యువకుడి దారుణహత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బుల కోసం ఇద్దరి మధ్య జరిగిన వివాదం కారణంగానే హత్య జరిగిందని తేల్చారు.
వివరాల్లోకి వెళితే కాలాపత్తర్ సమీపంలోని తాడ్బన్ రమ్నాన్పురా మోచీకాలనీకి చెందిన మహ్మద్ మోసిన్ అహ్మద్ ఓ న్యాయవాది వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఖాజాపహాడిలో గుర్రాలశాలకు వెళ్లి గుర్రాలపై స్వారీ చేయడంలో తర్ఫీదు కూడా పొందాడు.
అలాగే శుభకార్యాలకు గుర్రలశాల నుంచి అద్దెకు గుర్రాలను సమకూర్చేవాడు. ఈ క్రమంలో శాస్త్రిపురానికి చెందిన అమేర్ ఖురేషితో పాటు గుడ్డు, జాఫర్, రహ్మన్లతో మోసిన్కు పరిచయం ఏర్పడింది. వీరిలో అమేర్ వద్ద మోసిన్ 25 వేలు అప్పుగా తీసుకున్నాడు.
అమేర్ ఉపాధి నిమిత్తం కొద్దిరోజుల క్రితం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడ అతనికి ఎటువంటి పని లభించకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. తనకు ఖర్చులకు ఇబ్బందిగా ఉందని.. బాకీగా ఇచ్చిన డబ్బు వెంటనే ఇవ్వాల్సిందిగా అమేర్ తన స్నేహితుడు మోసిన్పై ఒత్తిడి తెచ్చాడు.
గొడవ జరుగుతుందని ముందుగానే ఊహించిన అమీర్ జేబులో కత్తి తీసుకుని వెళ్లాడు. గుర్రాలశాల వద్ద ఉన్న మోసిన్తో డబ్బు గురించి ఆరా తీశాడు. ఇద్దరికి వాగ్వాదం చోటు చేసుకోవడంతో కత్తితో మోసిన్పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావం కావడంతో తోటి స్నేహితులు మోసిన్ను తాడ్బన్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియాకు తరలిస్తుండగా మోసిన్ చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమేర్ను అదుపులోకి తీసుకున్నారు.