భద్రాచలం వద్ద గోదారి ఉగ్రరూపం.. 53 అడుగులకు చేరిన నీటిమట్టం, మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు తోడుఎగువ నుంచి వస్తున్న వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం సాయంత్రం నాటికి నీటి మట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. భద్రాచలంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 49 పునరావాస కేంద్రాలకు 4,900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇకపోతే.. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో వరద రోడ్లపైకి చేరింది. టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరవళ్ల నేపథ్యంలో తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారు కంట్రోల్ రూమ్కి సమాచారం అందించాలని.. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.
ALso Read: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం : రెండో ప్రమాద హెచ్చరిక జారీ, సాయంత్రానికి ఉధృతి మరింత పెరిగే ఛాన్స్
మరోవైపు.. వరద తగ్గుముఖం పట్టడంతో మోరంచపల్లివాసులు శుక్రవారం నాడు గ్రామానికి చేరుకున్నారు. వరద మిగిల్చిన బురదతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వాగు వరదలో గ్రామస్తులు సర్వం కోల్పోయారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇళ్లకు చేరుకున్న స్థానికులు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. 12 గంటల పాటు వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు గడిపారు. ఈ గ్రామంలో 250 కుటుంబాలు నివాసం ఉంటాయి.