ఉద్యోగుల బదిలీల్లో ఇబ్బందులుండొద్దు - టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్
తెలంగాణలో ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో ఉద్యోగాల సంఘాల నాయకులతో సీఎస్ సోమేష్ కుమార్ భేటీ అయ్యారు. పలు అంశాలు చర్చించారు.
ఉద్యోగుల బదిలీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. సీఎస్ సోమేష్ కుమార్తో ఉద్యోగ సంఘాల నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్ మాట్లాడారు. బదిలీల విషయంలో కొంత సాధరంగా వ్యవహరించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలో రేపటి నుంచి ఆప్షన్ సేకరిస్తామని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారని తెలిపారు. ఈ ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కేటాయించారని అన్నారు.
భార్యాభర్తలు ఉద్యోగులు అయితే వారిద్దరు ఒకే దగ్గర పని చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరామని తెలిపారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేసేందుకు సీఎస్ సోమేష్ కుమార్ సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. స్పౌస్ కేసులపై వచ్చిన అభ్యంతరాలను సీఎస్ కు వివరించామని తెలిపారు. జిల్లా స్థాయి, జోనల్ స్థాయి కేడర్ పోస్టుల విభజన కోసం ప్రభుత్వం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ను నియమించిందని చెప్పారు. అంతకు ముందు సీఎస్ సోమేష్ కుమార్ అన్ని డిపార్ట్మెంట్ల ముఖ్య అధికారులతో సమావేశం అయ్యారు. ఉద్యోగుల విభజన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపటి నుంచి ఉద్యోగుల విభజన ఆప్షన్ తీసుకోనున్నారు.