తెలంగాణలో లాక్డౌన్ ఉండదు: తేల్చేసిన కేసీఆర్
రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోబోమన్నారు. పరిశ్రమల మూసివేత కూడా ఉండదని ఆయన తేల్చి చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోబోమన్నారు. పరిశ్రమల మూసివేత కూడా ఉండదని ఆయన తేల్చి చెప్పారు.ద్రవ్య వినిమయ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ప్రసంగించారు.
స్కూళ్ల నుండి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్టుగా చెప్పారు. స్కూళ్లను బాధతోనే మూసివేశామన్నారు. స్కూల్స్ మూసివేయడం తమకు సంతోషంగా లేదన్నారు. అందుకే తాత్కాలికంగానే విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
also read:రిజర్వేషన్ల అమలు బాధ్యతను రాష్ట్రాలకు వదిలేయాలి: కేసీఆర్
కరోనా విషయంలో రాష్ట్రం తీసుకొన్న చర్యలను కేంద్ర ప్రభుత్వం కూడ ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో పరీక్షల సంఖ్యను పెంచాలని కూడ నిర్ణయం తీసుకొన్నట్టుగా చెప్పారు. నిన్న ఒక్క రోజునే 70 వేల కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఆయన తెలిపారు.
కరోనాను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. లాక్ డౌన్ ఉంటుందనే భయపడాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 10.85 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు.మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఆయన ప్రజలను కోరారు. పరిశుభ్రంగా ఉండడం ద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మిగిలినవారికి కూడ కేంద్రం అందించే వ్యాక్సిన్ ఆధారంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు. కరోనాతో అన్ని దేశాల జీడీపీలు కుప్పకూలిపోయాయన్నారు.