Asianet News TeluguAsianet News Telugu

జవహర్‌నగర్ కార్పోరేషన్‌లో అవిశ్వాస రాజకీయం : అనుకూల , వ్యతిరేక వర్గాలుగా చీలిన కార్పోరేటర్లు

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి పలు మున్సిపాలిటీలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. జవహర్ నగర్ కార్పోరేషన్‌లో మేయర్‌ కావ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అయితే కార్పోరేటర్లు అనుకూల , వ్యతిరేక వర్గాలుగా చిలిపోయారు.

no confidence motion against jawahar nagar mayor mekala kavya
Author
First Published Jan 29, 2023, 3:29 PM IST

జవహర్ నగర్ కార్పోరేషన్‌లో అవిశ్వాస తీర్మాన రాజకీయం వేడెక్కింది. మేయర్ కావ్యపై కొందరు కార్పోరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా .. మేయర్‌పై తమకు పూర్తి విశ్వాసం వుందని మరికొందరు కార్పోరేటర్లు చెబుతున్నారు. కార్పోరేషన్‌లో తమకు ఎలాంటి అసమ్మతి లేదని చెబుతున్నారు. కార్పోరేషన్ అన్నాక చిన్న చిన్న మనస్పర్థలు సహజమని వారు అంటున్నారు. 

కాగా.. తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌ పార్టీకి పలు మున్సిపాలిటీలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. పలు చోట్ల బీఆర్ఎస్‌లో విభేదాలు బయటపడుతుండగా.. కొన్నిచోట్ల మాత్రం విపక్షాలు ఏకమై తిరుగుబాటు చేసేందుకు సిద్దమయ్యాయి. మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైస్‌పర్సన్‌లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఒక్కరోజే మూడు చోట్ల అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 

ALso REad: బీఆర్ఎస్‌లో బయటపడుతున్న విభేదాలు.. మున్సిపాలిటీల్లో అవిశ్వాస సెగలు.. ఒకేరోజు మూడు చోట్ల..

తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న పరిమళ్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీజేఎస్‌ పార్టీలకు చెందిన 23 మంది కౌన్సిలర్లు ఉన్నారు.  మరోవైపు మేడ్చల్ జిల్లా జవహర్‌ నగర్ మేయర్‌పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. దాదాపు 20 మంది కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో నోటీసులు అందజేశారు. ఇక, పెద్దఅంబర్‌పేట నగరపంచాయితీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్స్‌లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టినవారిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. 

పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే గత శాసనసభ సమావేశాల్లో పురపాలక చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు పెట్టేలా సవరణ చేసింది. అయితే అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోద ముద్ర పడలేదు. దీంతో 2020 జనవరి 27న కొలువుదిరిగిన మున్సిపాలిటీ పాలకవర్గాల మూడేళ్ల పదవీకాలం పూర్తికావడంతో..  పలు చోట్ల అధికార బీఆర్‌ఎస్‌కు అవిశ్వాస తీర్మానాల భయం పట్టుకుంది. చాలా చోట్ల చోట్ల చైర్మన్‌, వైఎస్ చైర్మన్‌లపై వ్యతిరేకత.. పదవీకాలం పంపకం.. అదునుకోసం చూస్తున్న ఆశావాహులు.. బీఆర్ఎస్‌లో ముసలానికి కారణం అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios