వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌‌లు కలిసి పోటీ చేస్తాయట...ఎన్ని పార్టీలు కలిసినా టీఆర్ఎస్‌ను ఏమీ చేయలేరని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  చెప్పారు.తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్‌  సింహం సింగిల్‌గానే వస్తోందని కేటీఆర్ ప్రకటించారు.

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌‌లు కలిసి పోటీ చేస్తాయట...ఎన్ని పార్టీలు కలిసినా టీఆర్ఎస్‌ను ఏమీ చేయలేరని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్‌ సింహం సింగిల్‌గానే వస్తోందని కేటీఆర్ ప్రకటించారు.

సోమవారం నాడు సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. విపక్షాలపై మంత్రి విమర్శలు గుప్పించారు. తిన్నది అరగకనే విపక్షాలు సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి చెప్పారు. శ్రీరాముడి పాలనలో భూమి శిస్తు కూడ కట్టారు.కానీ, కేసీఆర్ పాలనలో మాత్రం రైతులకే డబ్బులు ఇస్తున్నాడని ఆయన చెప్పారు.

చరిత్రలో ఎవరూ కూడ చేయలేని పనులను చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ గొప్ప పరిణితి చెందిన నాయకుడుగా లోక్‌సభలో ప్రధానమంత్రి మోడీ కొనియాడారని ఆయన. గుర్తుచేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి మోడీ గుర్తించాడని... తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం ఈ అభివృద్ధి కన్పించడం లేదన్నారు.

సీఎం పదవి నుండి కేసీఆర్‌ను ఎందుకు దింపేయాలని భావిస్తున్నారో చెప్పాలని ఆయన విపక్షాలను ప్రశ్నించారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు సీఎం పదవి నుండి దింపాలని భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాజకీయ అజీర్ణులే కడుపుమంటతో ఉన్నారని మంత్రి కేటీఆర్ విపక్షనేతలపై విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టులు నిర్మించకుండా కేసులు వేసి అడ్డుకొంటున్నారని ఆయన విమర్శించారు.