కేసీఆర్ కేబినెట్లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల.. ఆయన బీజేపీలోకి వస్తే: ఎంపీ అరవింద్ సంచలనం
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులను సమర్ధించబోమని తేల్చి చెప్పారు. కేసీఆర్ నీచ రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి చేతులెత్తేశారని ఎంపీ ఆరోపించారు
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులను సమర్ధించబోమని తేల్చి చెప్పారు. కేసీఆర్ నీచ రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే ముఖ్యమంత్రి చేతులెత్తేశారని ఎంపీ ఆరోపించారు.
తెలంగాణ కేబినెట్లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల రాజేందర్ అని అరవింద్ ప్రశంసించారు. వైద్య ఆరోగ్యశాఖకు కనీస నిధులను కూడా కేసీఆర్ మంజూరు చేయటం లేదని ఆయన ఆరోపించారు. ఈటల, కేటీఆర్తో పాటు భూ ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఆర్ఎస్ నేతలపై విచారణ జరగాలని అరవింద్ డిమాండ్ చేశారు.
ఒకవేళ ఈటల రాజేందర్ వస్తే బీజేపీలో చేర్చుకోవటం అనేది తమ పార్టీ నాయకత్వం పరిధిలోని అంశమని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ సమర్ధించదని అరవింద్ వెల్లడించారు.
Also Read:77 మందిపై భూకబ్జా ఆరోపణలు: కేసీఆర్ ను ఉతికి ఆరేసిన బండి సంజయ్
అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ... టీఆర్ఎస్ నేతలు 77 మందిపై భూ కబ్జా ఆరోపణలు వున్నాయని ఆరోపించారు. వీరిలో ఎమ్మెల్యేలు, మంత్రులు వున్నారని, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆస్తులపైనా విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పరిస్ధితి గంభీరంగా వుందన్నారు . శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదాడి పట్టించారని సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ సీఎం కేసీఆర్ నేటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణలో కోవిడ్ మరణాలు సంఖ్యను రోజువారీ బులెటిన్ రూపంలో ప్రకటించాలని సంజయ్ కోరారు. మరణాలను వెల్లడించకుండా జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. కలెక్టర్లు ఇచ్చే నివేదికకు పూర్తిగా తేడా వుంటోందని ఆయన ఆరోపించారు.
ఈ విషయానికి సంబంధించి తాము ఎన్నోసార్లు ఆధారాలతో సహా నిరూపించామని సంజయ్ గుర్తుచేశారు. సీఎం వ్యాక్సిన్ తీసుకోలేదని, ఎవరినీ తీసుకోమని చెప్పలేదని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవ విషయాలు చెబితే ప్రజల్లో నిర్లక్ష్యం వుండదని సంజయ్ స్పష్టం చేశారు.