భోపాల్ - హైదరాబాద్ ఉగ్రకోణంపై ఎన్ఐఏ దర్యాప్తు
భోపాల్ - హైదరాబాద్ ఉగ్రకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపనుంది. గత నెలలో హెచ్యూటీ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

భోపాల్ - హైదరాబాద్ ఉగ్రకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపనుంది. ఈ టెర్రర్ రాకెట్ ఘటనలో 17 మంది హెచ్యూటీ అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసింది హెచ్యూటీ. దీంతో గత నెలలో హెచ్యూటీ అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇకపోతే.. హైదరాబాద్ నగరంలో హిజ్బ్ ఉత్ తహరీక్ సంస్థ సభ్యులు తమ ఉనికిని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డార్క్ వెబ్ సైట్ , రాకెట్ చాట్, తీమ్రా యాప్ లతో నిందితులు చాటింగ్ నిర్వహించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అరెస్టైన వారిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మరో ఆరుగురు హైద్రాబాద్ కు చెందినవారు. హైద్రాబాద్ లో ఉగ్ర మూకలు మూడు దశల్లో తమ ప్లాన్ ను అమలు చేసేలా వ్యూహారచన చేశాయి. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానెల్ ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ చానెల్ కు 3600 మంది సబ్ స్క్రైబర్లున్నారు. వీరంతా ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దాడులకు పాల్పడేందుకు గాను అనంతగిరి అడవుల్లో నిందితులు శిక్షణ పొందారని కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పేలుడు పదార్దాల తయారీ, తుపాకీ పేల్చడం వంటి వాటిపై నిందితులు శిక్షణ పొందారని సమాచారం.