హన్మకొండలో ఎన్ఐఏ సోదాలు.. సీఎంఎస్ నేత అనిత ఇంట్లో కొనసాగుతున్న తనిఖీలు..
తెలంగాణలోని హన్మకొండలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. చైతన్య మహిళా సంఘం నేత అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని హన్మకొండలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. చైతన్య మహిళా సంఘం నేత అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనితను పలు అంశాలపై ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సోదాలకు గల కారణాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జూన్లో ఎన్ఐఏ అధికారులు తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, సికింద్రాబాద్ జిల్లాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పెద్దబయలు మావోయిస్టు రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి హైకోర్టు న్యాయవాది, చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) సభ్యురాలు చుక్కా శిల్పను హైదరాబాద్లోని ఆమె నివాసం నుంచి అరెస్టు చేశారు. అంతేకాకుండా దొంగిల దేవేంద్ర, దుబాసి స్వప్నలను కూడా ఎన్ఐఏ అరెస్టు చేశారు.
నిషిద్ధ సంస్థ సీపీఐ (మావోయిస్ట్)లో యువతను ప్రేరేపించి రిక్రూట్ చేయడంలో నిందితుల ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. మూడుచోట్ల నిర్వహించిన సోదాల్లో.. డిజిటల్ పరికరాలతో సహా నేరారోపణలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఆ కేసు విషయానికి వస్తే.. నర్సింగ్ విద్యార్థి రాధ కొన్నేళ్ల క్రితం విశాఖపట్నంలో అదృశ్యమైంది. రాధను మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళ సంఘం నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఏడాది మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఎన్ఐఏకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఎన్ఐఏ ఈ కేసు టేకప్ చేసింది.