తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే... ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరోో ఐదురోజులపాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా మరో ఐదురోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటిచింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని... దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసారు.
ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. కాబట్టి వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాల రైతులు, అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Read More Monsoon : జూన్ 11 లోపు తెలంగాణకు రుతుపవనాల రాక.. ఈ సారి సాధారణ వర్షాలే..
నిన్న(ఆదివారం) హైదరాబాద్ తో పాటు పలుజిల్లాలో వర్షం కురిసింది. మండిపోతున్న ఎండల నుండి ఉపశమనం కల్పిస్తూ మధ్యాహ్నం వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలావుంటే నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని... ఈసారి సాధారణ వర్షపాతమే నమోదవనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. జూన్ నెలాఖరు నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నాయి.
రుతుపవనాల రాకతో మొదట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయనీ, అయితే ఆ తర్వాత జూలైలో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ-తెలంగాణ శాస్త్రవేత్త సీఏ శ్రావణి తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం 5 శాతం అధిక వర్షపాతం నమోదైన తర్వాత ఈ ఏడాది వార్షిక వర్షపాతం సాధారణం లేదా సాధారణం కంటే తక్కువగా నమోదవుతుంది. తెలంగాణలో జూన్ 1, 2022 నుంచి మే 27, 2023 మధ్య 1,377.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది సాధారణం కంటే 52% అధికం.