Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్ .. శంకర్‌ లక్ష్మీని విచారణకు పిలిచిన సిట్

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్ శంకర్ లక్ష్మీని సిట్ విచారణకు పిలిచింది. 

new twist in tspsc paper leak case
Author
First Published Mar 21, 2023, 8:02 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు కీలక మలుపు తిరిగింది. పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్‌ఛార్జ్ శంకర్ లక్ష్మీని సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ , రాజశేఖర్‌లు పాస్‌వర్డ్ దొంగిలించారని శంకర్ లక్ష్మీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె వాదనపై సిట్ విచారిస్తోంది. 

ఇదిలావుండగా.. ప్రశ్నాపత్రం లీక్  కేసు విచారణలో భాగంగా తెలంగాణలోని  పలు ప్రాంతాల్లో  సిట్  అధికారులు మంగళవారం సోదాలు  నిర్వహించారు. హైద్రాబాద్, మహబూబ్ నగర్, జగిత్యాలలలో   ఇవాళ  సిట్  అధికారులు  తనిఖీలు చేశారు. ఈ కేసులో  కీలక  నిందితులుగా  ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇళ్లలోనూ  సిట్  బృందం  సోదాలు నిర్వహించింది. రేణుకతో పాటు ఆమె భర్త  డాక్యానాయక్ తో  కలిసి  హైద్రాబాద్ లంగర్ హౌజ్ లో సిట్ అధికారులు తనిఖీలు  నిర్వహించారు.. లంగర్ హౌస్ సన్ సిటీలోని కాళీమందిర్ కు వెళ్లి అనుమానితులను   సిట్ అధికారులు  ప్రశ్నిస్తున్నారు. లంగర్ హౌజ్  నుండి  రేణుక స్వంత ఊరు  గండీడ్  కు  సిట్  అధికారులు  వెళ్లారు.  రాజశేఖర్ స్వగ్రామం  తాటిపల్లి గ్రామంలోనూ సిట్  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైద్రాబాద్ మణికొండలోని  రాజశేఖర్ రెడ్డి  ఇంట్లోనూ  సిట్  బృందం తనిఖీలు  చేసింది. రాజశేఖర్ రెడ్డి ఇంట్లో  గ్రూప్-1 ప్రశ్నాపత్రానికి  సంబంధించిన జీరాక్స్ పేపర్లను  సిట్  బృందం  స్వాధీనం  చేసుకుంది.  

Also REad: పేపర్ లీక్ కేసు.. ఉద్యోగాల్లోంచి రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌ల తొలగింపు

ఇకపోతే.. పేపర్ లీక్ కేసులో ఇద్దరు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. పేపర్ లీక్ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్‌లను ఉద్యోగాల్లోంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేణుక వనపర్తి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త డాక్యా నాయక్‌ వికారాబాద్ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పేపర్ లీక్ కేసు నేపథ్యంలో వీరిద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

కాగా.. ఈ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్ మరికొందరికీ పేపర్ ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు వాట్సాప్ చాట్‌ను సిట్ రిట్రీవ్ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 పేపర్‌ను చాలా మందికి సర్క్యూలేట్ చేసినట్లు గుర్తించారు. రాజశేఖర్, ప్రవీణ్, రేణుకలను విడివిడిగా విచారించారు అధికారులు. వీరి ముందు చాట్ డేటా పెట్టి ప్రశ్నలు సంధించారు. ప్రవీణ్ రాజశేఖర్‌లు కలిసే పేపర్ లీక్ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తించారు. రెండు కంప్యూటర్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు అధికారులు. అంతేకాకుండా ఐదు పేపర్లకు సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ చాట్‌లో గుర్తించారు అధికారులు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios