ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి మరో తలనొప్పి
- తెలియకుండానే కొత్త వివాదంలో ఇరుక్కున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- ఎమ్మెల్యే పేరుతో ఫోర్జరీ లేఖ రాసిన గుడి పూజారి
- విచారణ జరిపిన దేవాదాయ శాఖ అధికారులు
- పురోహితుడిపై సస్పెన్షన్ వేటు
మంత్రి పదవి కోసం కోయదొరలతో పూజలు చేయించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పరకాల ఎమ్మెల్యే కు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆయన అనుకోకుండా ఒక వివాదంలో ఇరుక్కుపోయారు. అందులో బాధితుడిగా మిగిలాడు. ఇంతకూ చల్లా ధర్మారెడ్డికి వచ్చిన ఆ తలనొప్పి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న కోమల్లపల్లి నాగభూషణ శర్మ, అదే ఆలయంలో పని చేస్తున్న ఈవోను బదిలీ చేయాలంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంతకాన్ని పోర్జరీ చేసి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే లేఖ రాసినట్లు భావించిన ఈవో సులోచన ఎమ్మెల్యేను కలిసి, ఆ బదిలీ లేఖ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈఓ చెప్పిన మాటతో ఎమ్మెల్యే షాక్ కు గురయ్యారు. తాను ఎవరికి ఎలాంటి లేఖ రాయలేదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యే పేరుతో లేఖ రాసిందేవరు అని విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది.
గవిచర్ల గుడికి దూప దీప నైవేద్యం కోసం ఎమ్మెల్యే ఇచ్చిన లేఖను పూజారి కోమల్లపల్లి నాగభూషణ శర్మ ఫోర్జరీ చేసినట్లు తేలింది. దీంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ పూజారి కోమల్లపల్లి నాగభూషణ శర్మపై చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ ను కోరారు. ఈ మేరకు ఫోర్జరీ వ్యవహరంపై విచారణ చేపట్టిన అధికారులు పూజారి కోమల్లపల్లి నాగభూషణ శర్మ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశాడని తేల్చారు. దీంతో ఆ పూజారిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది ఇలా ఉంటే గతంలో కూడా ఆలయ పూజారి కోమల్లపల్లి నాగభూషణ శర్మ విధులకు సరిగా హజరుకాకుండా తప్పించుకునే వాడని, ఎలాంటి రసీదు లేకుండానే భక్తుల పేరు మీద అర్చన చేసి ఆ డబ్బులను తన జేబులో వేసుకునేవాడని అధికారుల దృష్టికి వచ్చింది. మొత్తానికి రోజుకో వార్తతో చల్లా ధర్మారెడ్డి హాట్ టాపిక్ అయిపోయాడు.