BegumBazar Honor Killing : చంపిన వ్యక్తులు వేరు.. మాకు చూపినవారు వేరు, నీరజ్ కుటుంబ సభ్యుల ఆరోపణలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బేగంబజార్ పరువు హత్యకు సంబంధించి మృతుడు నీరజ్ బంధువులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హత్య చేసింది వేరే వారని, తమకు చూపించిన వారు వేరని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు నిందితులను తమ ముందు వుంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
షాహినాథ్గంజ్ పీఎస్ (shahinath gunj) వద్ద శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాహినాథ్ గంజ్ పీఎస్ వద్ద బేగంబజార్లో పరువు హత్యకు (BegumBazar Honor Killing ) గురైన నీరజ్ కుటుంబ సభ్యులు (neeraj panwar) బైఠాయించారు. నిందితులను తమ ముందు ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నీరజ్ మృతదేహానికి పోస్ట్మార్టానికి తాము ఒప్పుకోమని.. చంపిన వ్యక్తులు, తమకు చూపించే వ్యక్తులు వేరంటూ వారు ఆరోపిస్తున్నారు.
అంతకుముందు ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజన (sanjana) సోదరుడితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రోహిత్, రంజిత్, కౌశిక్ , విజయ్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. శుక్రవారం రెండు బైక్లపై వచ్చి నీరజ్పై దాడి చేశారు. అనంతరం నీరజ్ను కత్తులతో పొడిచి, రాళ్లతో తలపై మోది హత్య చేశారు. హత్య తర్వాత బైక్లపై కర్ణాటక పారిపోయారు నిందితులు. సంజన సోదరుడితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు.. పరువు హత్య కేసుకు సంబంధించి మృతుడు నీరజ్ పన్వార్ భార్య సంజన కుటుంబ సభ్యులు స్పందించారు. నీరజ్ హత్యకు సంబంధించి తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను సంజన తల్లి మధుబాయి ఖండించారు. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. నీరజ్ను ఎవరు చంపారో తమకు తెలియదని సంజన తల్లి చెప్పారు. నీరజ్ను హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ALso Read:నీరజ్ హత్యతో మా కుటుంబానికి సంబంధం లేదు.. నిందితులను కఠినంగా శిక్షించాలి: సంజన తల్లి
హత్య జరిగిన సమయంలో తన కుమారుడు కూడా ఇంట్లోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి తెలియగానే భయంతో ఇంట్లోంచి పారిపోయారని ఆమె తెలిపారు. సంజన దంపతులు సుఖంగా ఉంటే చాలనుకున్నామని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీరజ్ను చంపుతామని కొందరు బెదిరస్తూ వచ్చారని, వారెవరో మాత్రం తమకు తెలియదని అన్నారు. తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని.. తన అల్లుడిని హత్య చేసిన వాళ్లను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఈ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని చెప్పారు. ప్రేమ వివాహం ఇష్టలేకే ఏడాది పాటు సంజనతో మాట్లాడకుండా దూరంగా పెట్టామని ఆమె పేర్కొన్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సంజనతో రెండు మాట్లాడుతున్నట్టుగా చెప్పారు. సంజన సంతోషంగా ఉంటే చాలని అనుకున్నామని తెలిపారు.