పెద్దాయన క్లారిటీ గా చెప్పినా కనిపెట్టలేకపోయారా..?
లెక్కల్లో చిక్కులన్నీ విడదీసి పిల్లలకు చెప్పే టీచర్లకు కూడా తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు అర్థం అవడం లేదు. ఇక టీచర్ జాబుల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏం అర్థమవుతాయో...
నాయిని నర్సింహారెడ్డి...
గులాబీ పార్టీకి పెద్దన్న... సీఎం కేసీఆర్ కు అంతరంగికుడు.. అంతకుమించి రాష్ట్ర హొం మంత్రి.. నిజాన్ని దాచుకోకుండా నిర్భయంగా భయటపెట్టగల భోళా మనిషి...
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఎన్ని విశేషణాలైనా తగిలించవచ్చు.
రెండు రోజుల కిందట ఆయన పాఠశాల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) ఏర్పాటు చేసిన సభకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లపై తన మనసులోని మాట బయటపెట్టాడు.
రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల కంటే ప్రైవేటు స్కుళ్లలోనే నాణ్యమైన విద్యఅందుతుందని స్పష్టం చేశారు. అసలు ప్రైవేటు స్కూళ్లకు తమ ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదని అభయం ఇచ్చారు.
అందుకే కాబోలు టీచర్ నియామకాల కోసం నిరద్యోగ అభ్యర్థులు మూడేళ్ల నుంచి ఎదరు చూస్తున్న పట్టించుకోవడం లేదు. ప్రైవేటు స్కూల్ ను పెంచిపోషించే దిశగా ఆలోచించడం వల్లే అనుకుంటా ప్రభుత్వ టీచర్ల నియామకాలకు పచ్చాజెండా ఊపడం లేదు.
ఈ విషయం తెలియక పాపం.. నిరుద్యోగ అభ్యర్థులు.... వేల రూపాయిలు ఖర్చు పెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నారు. కడుపుమండి డీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాలకు దిగుతున్నారు.
పెద్దన్న కాస్త డీఎస్సీ ప్రకటన విషయంపై కేసీఆర్ మనసులోని మాట కూడా బయటపెట్టి ఉంటే బాగుండేది వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు కూడా చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చేవారు.