సారాంశం

హీరో నవదీప్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

హీరో నవదీప్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. నవదీప్ ఇంటి వద్ద ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 23వ తేదీన హెచ్-న్యూ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్‌ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నార్కొటిక్‌ బ్యూరో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నవదీప్‌ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. 

నవదీప్‌కు 41ఏ నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు.. 
ఇటీవల డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు సినీ దర్శకుడు, మాజీ ఎంపీ కొడుకు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నవదీప్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పటికే కస్టడీలో ఉన్న స్నేహితుడు రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసుల తెలిపారు. 

మరోవైపు నవదీప్ ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని ఖండించారు. అయితే ఇరువైపుల న్యాయవాదనలు విన్న న్యాయస్థానం.. నవదీప్‌కు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి.. విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.