రైతుల ఆందోళనలపై కేంద్రం అణచివేత ధోరణితో ఉంది: ఉత్తమ్
రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
న్యూఢిల్లీ: రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం నాడు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ సంస్కరణలపై అందరితో చర్చించి కొత్త చట్టాలను తెచ్చామని కేంద్రం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు.
also read:మరో షాహీన్బాగ్గా మార్చొద్దు: రైతు ఆందోళనలపై విపక్షాలకు బీజేపీ సూచన
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దంగా ఉన్నాయన్నారు. రాష్ట్రాల పరిధిలోని అంశాలను కూడ రాష్ట్రాల ఆమోదం లేకుండానే కేంద్రం తెచ్చిందని ఆయన విమర్శించారు. రైతుల ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని ఆయన చెప్పారు.
నూతన వ్యవసాయచట్టాలతో ఏ మేరకు రైతుల ఆదాయం పెరుగుతోందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయిందన్నారు. కొత్త చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు.నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.