తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓ ముఖ్యనేత, కొందరు ఇంటి దొంగలు కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించారు టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక ఓ ముఖ్య నేత వున్నాడని.. అతనే కుట్ర చేసి ఇదంతా చేయిస్తున్నాడని ఉత్తమ్ శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు . 30 ఏళ్లుగా నిజాయితీ గల కార్యకర్తగా పనిచేస్తే తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండేళ్లుగా తమను టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. తాను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా వుండొచ్చునని.. కానీ పార్టీకి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు . 24 గంటలూ , 365 రోజులూ ప్రజల కోసమే పనిచేస్తున్నానని.. బీఆర్ఎస్లో చేరేది లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీలో నా అనుచరులను అణగదొక్కడానికి, వాళ్లను తొలగించడమే లక్ష్యంగా ప్రచారం జరిగింది ఆయన ఆరోపించారు. దీనిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఉత్తమ్ వాపోయారు.
