నాదెండ్ల మనోహర్ కారును ఢీకొట్టిన లారీ: తృటిలో తప్పిన ప్రమాదం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్వాయ్ లో జరిగిన ప్రమాదం గురించి మరిచిపోక ముందే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి నాదెండ్ల మనోహర్ తృటిలో తప్పించుకున్నారు.
హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాన్వాయ్ లో జరిగిన ప్రమాదం గురించి మరిచిపోక ముందే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి నాదెండ్ల మనోహర్ తృటిలో తప్పించుకున్నారు.
ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. అయితే అందులో ప్రయాణిస్తున్న ఆయన సురక్షితంగా బయట పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో నివసిస్తున్న నాదెండ్ల మనోహర్ కారులో ఈ నెల 15వ తేదీన డ్రైవర్ రాజుతో కలిసి మాదాపూర్ వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లో హెరిటేజ్ వద్ద కారు మలుపు తీసుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన లారీ (టీఎస్ 05 యుబి 2449) ఢీకొట్టింది. కారు వెనుక భాగం పూర్తిగా దెబ్బతింది.
మనోహర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కారు డ్రైవర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు లారీ డ్రైవర్ నాగరాజుపై ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.